– రూ.2.40 లక్షల నగదు, 22 గొర్రెలు, 8 కార్లు సీజ్
– వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్
నీలగిరి, ఆగస్టు 26 : ఖరీదైన కార్లలో రాత్రి సమయాల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న 16 మందితో కూడిన నాలుగు అంతర్ జిల్లా దొంగల ముఠాలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.2.46 లక్షల నగదు, 22 గొర్రెలు, రూ.17 లక్షల విలువ గల 8 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెలడించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత కొంత కాలంగా జిల్లాలో మేకలు, గొర్రెలు వరుసగా చోరీకి గురైతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం సమయంలో శాలిగౌరారం మండలంలోని బైరవోనిబండ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న సమయంలో అటుగా వచ్చిన షిఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేసేందుకు దగ్గరకు వెళ్తుండగా అందులోని వారు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. వెంటనే వాహనాన్ని వెంబడించి పట్టుకోగా అందులో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లుగా తెలిపారు. వారి వేలి ముద్రలను స్కాన్ చేయడంతో సంఘం, వెంకటేశ్, వెంరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంపంగి శారద, దాసర్ల వినోద్ కుమార్ అలియాస్ కోటిగా గుర్తించినట్లు తెలిపారు.
వీరిపైన గతంలో నల్లగొండ రూరల్, కనగల్, చండూర్, విజయపురి, నార్కట్పల్లి, నల్లగొండ 2 టౌన్, మర్రిగూడ, దేవరకొండ, శాలిగౌరారం, నాంపల్లి, మునుగోడు, చింతపల్లి పోలీస్ స్టేషన్లలో మేకల దొంగతనాల కేసులు నమోదై అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. వీరితో పాటు పరిచయం ఉన్న మరో 12 మందితో కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడినట్లు తెలిపారు. పట్టుబడిన వారు ఒక గ్యాంగ్గా వరికుప్పల రవి @ చింటూ, గండికోట శివకుమార్, అమ్ములూరి విజయ్, వరికుప్పల రాజు, లింగాల ఆశోక్, ఉండం కళ్యాణి, కౌటేశ్ ( లక్ష్మీ, కనుకుల బేబీ, రెండో గ్యాంగ్గా వల్లెపు ప్రసాద్, మత్యాల సహదేవ్, మూడో గ్యాంగ్గా కోడిసే వంశీ కృష్ణ, కంపాటి హుస్సేన్, కంపాటి అజయ్ కుమార్, మట్టి సురేశ్ నాలుగు గ్యాంగ్లుగా ఏర్పడినట్లు తెలిపారు. వీరంతా ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లలో వచ్చి పగటి పూట రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో వచ్చి మేకలు, గొర్రెలను కార్లలో వేసుకుని దొంగతనాలకు పాల్పడేవారన్నారు.
విచారణలో వీరంతా జిల్లాలో 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకల దొంగతనాలకు పాల్పడినట్టు తేలిందన్నారు. దొంగలించిన మేకలను సంతల్లో అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండేవారన్నారు. మొత్తం 23 నేరాలకు సంబంధించి 200కు పైగా మేకలు, గొర్రెలు అమ్మినట్లు తెలిపారు. కేసును నల్లగొండ డీఎస్సీ కొలను శివరాంరెడ్డి పర్యవేక్షంలో చేధించారు. డీఎస్సీ కొలను శివరాంరెడ్డి, నల్లగొండ సీసీఎస్ సీఐలు ఎం.జితేందర్ రెడ్డి. ఎం.నాగభూషణ్, శాలిగౌరారం సీఐ కె.కొండల్ రెడ్డి, నార్కట్ పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్ఐలు శివకుమార్, విజయ్ కుమార్, రవి, రవి కుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, వహీద్ పాషా, సూఫీయాన్ అలీ, రామ్ ప్రసాద్, నాగరాజు, సీసీఎస్ కానిస్టేబుల్ ఆశ్రార్, మహేశ్, సాయి, వెంకట్ రామ్ను ఎస్పీ అభినందించారు. వారికి ప్రత్యేకంగా ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేశారు.