24 గంటల నాణ్యమైన కరంట్ సరఫరాతో విద్యుత్ విప్లవానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తున్నది. బిల్లుల భారం తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా 2కే డబ్ల్యూ, 3కేడబ్ల్యూ సోలార్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించింది. అందుకోసం స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేసి స్త్రీనిధి నుంచి సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నది. పైలెట్ ప్రాజెక్ట్గా యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి మండలాలను ఎంపిక చేసి, 140 యూనిట్లను మంజూరు చేసింది. నల్లగొండ జిల్లాలో కేతేపల్లి, మునుగోడు, దామరచర్ల, నార్కెట్పల్లి మండలాలను, సూర్యాపేట జిల్లాలో 12 మండలాలను ఎంపిక చేసింది. స్త్రీనిధి కింద ఒక్కో యూనిట్కు లక్ష రూపాయల నుంచి రూ.లక్షా పాతిక వేల రుణం ఇవ్వనున్నది. ఐదేండ్ల కాలపరిమితిలో చెల్లించేలా అవకాశం కల్పిస్తున్నది. వినియోగదారులు 25 ఏండ్లపాటు ఉచిత విద్యుత్ను పొందడమేగాక, ఉత్పత్తి చేసిన విద్యుత్లో మిగులును విక్రయించేందుకు గ్రిడ్కు అనుసంధానం చేసేలా ప్రణాళిక రూపొందించింది.
– యాదాద్రి భువనగిరి, జనవరి 9 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : సౌర విద్యుత్ వైపు స్వయం సహాయక సంఘాలను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. విద్యుత్ ఖర్చుల భారం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా 2కే డబ్ల్యూ, 3కే డబ్ల్యూ సోలార్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించింది. నెట్ మీటరింగ్తో గృహావసరాలకు వినియోగించగా.. మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు ఇచ్చి అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో తీసుకొచ్చింది. సభ్యులు తమ గృహావసరాల కోసం నెలకు 200 నుంచి 300 యూనిట్ల విద్యుత్ వాడుకుంటే 2కే డబ్ల్యూ (కిలో వాట్) లేదా 3కే డబ్ల్యూ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 19,154 మహిళా సంఘాల్లో 1,93,090 మంది సభ్యులు ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి మున్సిపాలిటీకి 35యూనిట్ల చొప్పున మొత్తం 140 యూనిట్లు మంజూరయ్యాయి. ఈ మండలాల్లో అమలు చేశాక, ఆ తర్వాత జిల్లా అంతటా విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి, మునుగోడు, దామరచర్ల, నార్కట్పల్లి మండలాల్లో 20 యూనిట్లు మంజూరు చేశారు. నెలాఖరు వరకు 200 యూనిట్లు ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో పైలెట్ప్రాజెక్టు కింద 12 మండలాలకు 410 యూనిట్లు మంజూరయ్యాయి.
ఎంతో ఉపయుక్తం..
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. విద్యుత్ వినియోగ బిల్లు తగ్గుతుంది. నిర్వహణ ఖర్చులు ఉండవు. రోజుకు 8 నుంచి 12 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గృహావసరాలకు వాడుకోగా.. మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసి అవసరానికి వాడుకోవచ్చు. పెట్టుబడి ఐదేండ్లలో తీరిపోతుంది. సోలార్ ప్యానెళ్లకు 25 ఏండ్లు, యూనిట్కు ఐదేండ్ల వారంటీ ఉంటుంది.
ఇవీ అర్హతలు..
పొదుపు సంఘంలో సభ్యురాలై ఉండాలి. నెలకు కరెంట్ బిల్లు కనీసం రూ.200కు పైగా రావాలి. తమ ఇంటి పైకప్పు శ్లాబుతో ఉండాలి. సోలార్ ప్యానెళ్లు బిగించడానికి ఆర్సీసీ ఇల్లుకు సుమారు 160 నుంచి 200 చదరపు అడుగుల భవనం ఉండాలి. బ్యాంకులో ఎలాంటి రుణ బకాయి ఉండకూడదు. దీనిపై త్వరలోనే స్త్రీనిధి, రెడ్కో ఆధ్వర్యంలో అవగాహన కల్పించనున్నారు.
రూ.లక్షకు పైగా రుణాలు
జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాల్లో సోలార్ విద్యుత్కు 140 యూనిట్లు మంజూరయ్యాయి. త్వరలో జిల్లా అంతటా విస్తరిస్తాం. సోలార్ విద్యుత్ యూనిట్ పూర్తి స్థాయిలో అమర్చాక తనిఖీ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తాం. ఆ తర్వాత స్త్రీనిధి నుంచి రుణాన్ని సభ్యురాలి ఖాతాలో జమ చేస్తాం. యూనిట్ను బట్టి లక్ష నుంచి రూ.1.25లక్షల వరకు రుణాలు ఇస్తాం. 60 నెలల్లో కిస్తీలు కట్టి తీర్చాలి.
– రామకృష్ణ, స్త్రీనిధి రీజినల్ మేనేజర్, యాదాద్రి భువనగిరి