నల్లగొండ, మే 2 : నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెకింపు కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోగ్ జీవన్ గాంకర్ గురువారం జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి తనిఖీ చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెకింపు కోసం ఏర్పాటు చేసిన బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెకింపు హాళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్ ఓట్ల లెకింపునకు వినియోగించనున్న టేబుళ్లు, పోలింగ్ కేంద్రాలు, సీసీ టీవీల ఏర్పాటు తదితర వివరాలను కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ట్రాన్స్కో ఎస్ఈ చంద్రమోహన్, పీఆర్ ఈఈ భూమయ్య, డీఈ నాగయ్య, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, పోలీసు అధికారులు ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : మనోజ్ కుమార్
పొరపాట్లకు ఆసారం లేకుండా పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం ఆయన పీఓ, ఏపీఓలకు ఇస్తున్న రెండో విడుత శిక్షణ తరగతులను పరిశీలించారు. వారితో ముఖాముఖి మాట్లాడారు.
టెండర్ ఓటు, చాలెంజ్ ఓట్లు, పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడే వారు, పోలింగ్ రోజున ఈవీఎం ప్రారంభించే సమయం, మే 13న నిర్వహిస్తున్న పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం పెంచిన విషయం, తదితర అన్ని వివరాలను అడుగగా, శిక్షణకు హాజరైన పీఓ, ఏపీఓలు సమాధానాలను ఇచ్చారు. ఇబ్బందులు లేకుండా, పొరపాట్లకు తావివ్వకుండా పోలింగ్ నిర్వహించాలని ఆయన సూచించారు. ఆయన వెంట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, ట్రైనింగ్ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్ తదితరులు ఉన్నారు.