– రాజ్యాంగ, నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి
దామరచర్ల, ఏప్రిల్ 17 : కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్యాయం చేస్తుందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్లలో ఆ సంఘం నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దామరచర్ల మండల నామినేట్ పదవిలో దళితులకు ఈ రోజుకి ఎలాంటి పదవులు దక్కలేదన్నారు. దామరచర్ల మండలం ఏర్పడి సుమారు 40 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఎస్సీలకు నామినేట్ పదవిలో గాని రాజ్యాంగ పదవి గాని కేటాయించక పోవడం దురదృష్టకరమన్నారు. అన్ని పదవుల్లో అగ్ర వర్ణాలకే ప్రాధాన్యత దక్కుతుందని జనాభాలో 18 శాతం ఉన్న దళితులకు పదవులు రాలేదనీ, రాజ్యాంగ పరంగా దక్కాల్సిన పదవులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాబోవు నామినేట్ పదవులలో, రాజ్యాంగ పదవులలో అనగా ఎంపీపీ, జడ్పిటీసి పదవుల్లో అవకాశం కల్పించాలన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ అధిష్టానం కడా ఆలోచన చేయాలని కోరారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎస్సీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల మండలంలో దళిత సంఘం నాయకులు కొమ్ము దాసు, ఆకారపు గోపాల్ మాజీ సర్పంచ్ భైరం నర్సయ్య గారు, మహంకాళి రాజేష్, సందాల శంభయ్య, తాళ్లపల్లి విజయ్, పోలేపల్లి ఉదయ్ , వట్టపు ఉదయ్, బీసీ సంఘం నాయకులు పగిడి జడయ్య యాదవ్ అల్లం నాగరాజు, ఎస్కే గాలిబ్,బలుగూరి విజయ్ కుమార్ కలకొండ హరీష్, కోట రాజు, ఎర్ర మాద కుమార్, మంజుల శ్రీకాంత్, చిలుకూరు అశోక్, సతీష్ కుమార్, కోట చంద్రబాబు,కుక్కల గోపి, కొమ్ము సాయి, తాళ్లపల్లి దావీదు, తదితరులు పాల్గొన్నారు