రాజాపేట, నవంబర్ 28 : ఒకప్పుడు పూరి గుడిసెలతో దర్శనమిచ్చే ఆ మారుమూల తండా.. నేడు పెద్ద పెద్ద బిల్డింగులతో పట్టణాన్ని తలపిస్తున్నది. తండావాసులు కష్టించి పోగు చేసిన సొమ్ముతో విలాసవంతమైన బంగ్లాలు నిర్మించుకున్నారు. గుడిసెలు ఉన్న రోజుల్లో వానొస్తే తడిసి రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అన్ని హంగులతో నిర్మించుకున్న భవనాల్లో హాయిగా కునుకు తీస్తున్నారు.
రాజాపేట మండలంలోని ఏకైక గిరిజన తండా పుట్టెగూడెం. ఇటీవల కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడిన ఈ తండాలో 185 నివాస గృహాలు ఉండగా.. 1100 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడి గిరిజనులంతా వ్యవసాయంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. ప్రధానంగా ఉల్లిగడ్డ, అల్లం, ఎల్లిగడ్డ, ఎండుమర్చి, మసాలా దినుసులు, జొన్నలు, నువ్వులు, మినప పప్పు, నూకల వ్యాపారం చేస్తారు. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల మండలాల్లోని ఊరూరా తిరుగుతూ సరుకులు అమ్ముతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. కొందరు ఇసుక, ఇటుక వ్యాపారం చేస్తున్నారు. కష్టించి పోగు చేసుకున్న సొమ్ముతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకుంటున్నారు. ఒకరికొకరు పోటీ పడి ఖరీదైన భవనాలు నిర్మించుకోవడంతో ఇప్పుడా తండా పట్టణాన్ని తలపిస్తుంది. అదేవిధంగా ఇంటింటికీ బైక్తోపాటు మరికొంత మంది కార్లు, బొలేరో వాహనాలు కలిగి ఉన్నారు.
పల్లె ప్రగతితో మౌలిక వసతులు
పల్లె ప్రగతి కార్యక్రమంతో పుట్టెగూడెం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నది. పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధతో మౌలిక వసతులు సమకూరాయి. తండాలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందించడంతోపాటు రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు, రూ.2లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.1.40 లక్షలతో వన నర్సరీని ఏర్పాటు చేశారు. ట్రాక్టర్తో పాటు ట్రాలీ కొనుగోలు చేసి ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నారు. దీంతో గ్రామం పరిశుభ్రంగా మారింది.
తండాలో అన్నీ బంగ్లాలే..
మాది మండలంలోనే ఏకైక గిరిజన తండా. ఇక్కడ అందరూ వ్యవసాయంతో పాటు వివిధ రకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తారు. వచ్చిన ఆదాయంలో కొంత కుటుంబ పోషణకు వెచ్చించి, మిగిలిన డబ్బును పొదుపు చేసుకుంటారు. తండా వాసుల్లో చైతన్యం వచ్చి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. ఖరీదైన బంగ్లాలతో తండా రూపురేఖలు మారిపోయాయి.
తండా అభివృద్ధికి కృషి
ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటైన మా తండాకు గ్రామస్తులు నన్ను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఊళ్లో అన్నీ ఖరీదైన భవనాలు నిర్మించుకోవడంతో మౌలిక వసతుల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నాం. తండాను ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా ప్రథమ కర్తవ్యం.