యావత్ దేశం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్వైపు చూస్తున్నది. ఆయన నాయకత్వాన్నే జాతి కోరుకుంటున్నది. బీజేపీ, మోదీ పాలనలో దేశ ప్రతిష్ట చాలా తగ్గింది. అరాచక పాలన పెరిగింది. రైతులు, ప్రజలు, యువత.. ఇలా ఏ వర్గం కూడా నేడు ప్రశాంతంగా లేదు. అన్ని రాష్ర్టాల ప్రజలు తెలంగాణ వంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక బీజేపీని పారదోలాలంటే కేసీఆర్ వెంటనే దేశ రాజకీయాల్లోకి రావాలి.
– బడుగుల లింగయ్యయాదవ్, టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ
సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తుండడం శుభపరిణామం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ప్రజల సమస్యలు విస్మరిస్తూనే ఉంది. జాతి అభివృద్ధిని దిగజార్చిన బీజేపీ సర్కారును గద్దె దించగలిగే సమర్థుడు సీఎం కేసీఆర్. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి ప్రజల సమస్యలపై గొంతెత్తి నిలదీసే సత్తా ఉన్న నాయకుడు ఆయన మాత్రమే. – రమావత్ రవీంద్రకుమార్, టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే
సూర్యాపేట, సెప్టెంబర్ 9, నమస్తే తెలంగాణ : మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే యావత్ దేశం కోరుకుంటుందని.. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోని వెంటనే రావాలని.. బీజేపీ, మోదీ పాలనలో మన దేశ గౌరవం చాలా తగ్గిందని రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ వెంటనే కేంద్ర రాజకీయాలకు రావాలని ఆయన ఆకాంక్షించారు.
దేశంలో అరాచక పాలన పెరిగిందని.. రైతులు, ప్రజలు, యువత, వ్యాపారులే కాదు నేడు దేశంలో ఏ వర్గాలు కూడా ప్రశాంతంగా లేవన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ పాలనతో ప్రపంచ దేశాల్లో ఇండియా గౌరవం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా మోదీ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి పెట్టి మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. ప్రస్తుతం బడా వ్యాపారుల చేతికి దేశం పోయిందని.. ఇట్లనే ఉంటే దేశం మన చేదాటి పోక తప్పదన్నారు. ప్రధాని మోదీ పూర్తిగా అభివృద్ధిని మరిచి మతతత్వ రాజకీయాలతో దేశాన్ని ఆగం చేస్తూ మతతత్వ రాజకీయాలు పోషిస్తుండ్రు తప్ప చేస్తున్న అభివృద్ధ్ధి ఏమీ లేదన్నారు. ఇప్పటికే నల్ల చట్టాలు తెచ్చి ఆగం చేసిండ్రు.. మోటర్లకు మీటర్లు పెట్టే బిల్లు తేబోతుండ్రు.. అందుకే ప్రజా వ్యతిరేక బీజేపీని పారద్రోలాలంటే మన కేసీఆర్ వేంటనే దేశ రాజకీయాల్లోకి రావాలన్నారు. దేశ ప్రజలు తెలంగాణ లాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలో అమలవుతున్న ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల వంటి వినూత్న పథకాలు యావత్ దేశంలో రావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 70 లక్షల టీఎంసీలు సాగు నీరు అందుబాటులో ఉన్నా కేవలం 40 లక్షల టీఎంసీలు మాత్రమే వాడుతున్నామని.. మిగిలిన 30 లక్షల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందన్నారు.
అలాగే ప్రస్తుతం విద్యుత్ 4 లక్షల మెగావాట్లు వాడుకునే సామర్థ్యం ఉన్నా కేవలం 2 లక్షల మెగా వాట్లు మాత్రమే వాడుకుంటున్నామని మిగతా 2 లక్షల మెగా వాట్లు వృథా అవుతుందన్నారు. కనీసం కరెంటు, నీరు పుష్కలంగా వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వాడుకోలేక పోతున్నామని.. అంతే కాకుండా ప్రస్తుతం రూపాయి విలువ పడిపోయిందని.. జీడీపీ తగ్గిందని.. ధరల పెరుగుదల విపరీతంగా పెంచారన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచడంతో పాటు జీఎస్టీని పెట్టి ప్రజలను అయోమయ పరిస్థితుల్లో పడేశారన్నారు. ఇక నోట్ల రద్దుతో పెద్దనోట్లు తెచ్చి నల్లదనం వెనక్కి తెస్తామని పేదల నోట్లో మన్ను కొట్టారన్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితిలో మన సీఎం కేసీఆర్ దేశ రాజకీయల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలోని ప్రతి పక్షాలన్నీంటిని ఏకం చేసి బీజేపీని దేశం నుంచి పారదోలాలంటే కేవల సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యం అవుతుందన్నారు. ఇది దేశ వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్న మాట అన్నారు.