తిరుమలగిరి, సెప్టెంబర్ 15 : బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. అన్ని హంగులతో పక్కా వసతి గృహాలను నిర్మించారు. ఇంటిని మరిపించేలా హాస్టళ్ల నిర్వహణ ఉండడంతో విద్యార్థులు సంతోషంగా చదువుకుంటున్నారు.
సమైక్య పాలనలో వసతి గృహాలు అద్దె భవనాల్లో అరకొర వసతులతో ఇబ్బందికరంగా ఉండేవి. దొడ్డు బియ్యం, నీళ్ల చారు, పురుగుల అన్నమే దిక్కయ్యేది. మరుగుదొడ్లు, బాత్రూమ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనేవారు. సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలు చేసిన సంఘటనలు అనేకం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదుల్లేక, ఫ్యాన్లు లేక ఇరుకు గదుల్లో ఈగలు, దోమలతో సహవాసం చేసేవారు. కానీ.. స్వరాష్ట్రంలో పరిస్థితులు మారాయి. అన్ని హంగులతో పక్కా భవనాలు అందుబాటులోకి వచ్చాయి. సకల సౌలత్లు కల్పించడంతో హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది.
గతంలో తిరుమలగిరిలో హాస్టళ్లన్నీ అద్దె భవనాల్లో కొనసాగగా.. నేడు అన్నీ పక్కా వసతి గృహాలను నిర్మించారు. ఒక్కో భవనం కోటీ ఇరవై లక్షలతో అన్ని హంగులతో విశాలంగా నిర్మించారు. హాస్టళ్లన్నీ ఒకేచోట క్యాంపస్ తరహాలో ఉన్నాయి. బీసీ బాలుర, బాలికల, ఎస్టీ బాలుర, బాలికల, ఇంటర్ బాలికల వసతి గృహాలను నిర్మించారు. వీటిల్లో దాదాపు 600 మంది విద్యార్థ్దులు వసతి పొందుతున్నారు. అదేవిధంగా హాస్టల్ ఆవరణలో పెంచిన చెట్ల కింద ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు చదువుకుంటున్నారు.
గతంలో వసతి గృహాల్లో ఉండాలంటే విద్యార్థులు భయపడేవారు. పరిశుభ్రత లేక విద్యార్థులు తరచూ జ్వరాల బారినపడుతూ మధ్యలోనే వెళ్లిపోయేవారు. నేడు పరిశుభ్ర వాతావరణం, మంచి మెనూ అందిస్తుండడంతో వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. గతంలో ఒక్కో హాస్టల్లో 50కి మించి విద్యార్థులు ఉండేవారు కాదు. నేడు మూడింతలు పెరిగారు. వీటితోపాటు ప్రతి మండలానికి కస్తూర్బా గాంధీ, మోడల్ స్కూల్, గురుకులాల వసతి గృహాలు కూడా ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వసతి గృహాల రూపురేఖలు మారాయి. విశాలమైన భవనాలు, సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థులు హాస్టళ్లలో ఉండేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సన్న బియ్యం, నాణ్యమైన భోజనం నూతన మెనూ విధానం ఆకట్టుకుంటున్నది. ఇంటిని మరిపించేలా వసతి గృహాల నిర్వహణ ఉన్నది.
– ఎండీ గఫార్, తెలంగాణ జాగృతి విద్యార్థి నాయకుడు, తిరుమలగిరి