ఈశాన్య గాలుల ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలపై చలి పంజా విసురుతున్నది. రెండ్రోజుల నుంచి గజగజ వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. సోమవారం నల్లగొండ జిల్లాలో 14.8 డిగ్రీలు, సూర్యాపేటలో 13 డిగ్రీలు, యాదాద్రిలో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున మాత్రం ఇంతకు రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కుగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఉదయం కొంత ఎండ కాస్తున్నా చలి గాలుల తీవ్రత ముందు తేలిపోతున్నది. ఉదయం తొమ్మిది గంటల్లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, హృద్రోగులు జాగ్రత్తలు పాటించాలని, చలి గాలులకు తిరుగొద్దని సూచిస్తున్నారు.
నల్లగొండ, జనవరి 9: జిల్లాలో మాండూస్ తూఫాన్ కారణంగా నెల రోజుల క్రితం చలి ప్రభావం కనిపించినప్పటికీ ఆ తర్వాత పెద్దగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడలేదు. అయితే గత రెండు రోజులుగా ఈశాన్య గాలుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతున్నది. మధ్య ప్రదేశ్ విదర్భ నుంచి వీస్తున్న చలి గాలులతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రభావం దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఉండటంతో కనిష్ట ఉష్ణోగ్రతల్లో క్షీణత కనిపిస్తున్నది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడి పోతుండటంతో సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. పైగా తెల్లవారు జాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కురుస్తుండటంతో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. చలికి వణకటంతో పాటు మంచుకు తడిసి ఇబ్బంది పడుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఈశాన్య గాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 29 డిగ్రీలు నమోదవుతుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 16.4 డిగ్రీలుడి నమోదైంది. ఇక సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు నమోదు అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం 11 డిగ్రీలకు పడిపోయాయి.
సోమవారం నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 14.8 డిగ్రీలు కాగా కనిష్టం 14.8 డిగ్రీలుగా నమోదైంది. ఇక సూర్యాపేటలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలు నమోదు కాగా యాదాద్రిలో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగా నమోదైంది. అయితే తెల్లవారు జామున మాత్రం ప్రస్తుతం నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలకు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.