నీలగిరి, డిసెంబర్ 28 : స్వరాష్ట్రంలో ప్రజా సంరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరంలో 32 రకాలవి 7,874 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 7,674 నమోదయ్యాయి. వ్యక్తిగత హత్యలు, పాత కక్షలు, లైంగిక దాడులు, చీటింగ్ కేసులు చాలా వరకు తగ్గాయి. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, మిస్పింగ్ కేసులు పెరిగినప్పటికి ఐపీసీ సెక్షన్ల కేసులను చాలా వరకు నియంత్రించడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం విజయవంతమైంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రితోపాటు అనేక మంది వీవీఐపీలకు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. గ్రామాలను క్లస్టర్ల వారీగా విభజించి శాంతిభద్రతలు పరిరక్షించారు. అభ్యర్థుల నామినేషన్లు, నాయకుల రోడ్షోలు, సభల నిర్వహణ సమయంలో అవాంఛనీయ సంఘటనలు లేకుండా 3,514 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ ఎన్నికల సందర్భంగా ముందస్తుగా 3,732 మందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ చేయడంతోపాటు 177 మంది నుంచి లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించారు. 2,187 వాహనాలను తనిఖీ చేసి రూ.50 కోట్ల నగదుతోపాటు లిక్కర్, గంజాయి, ఎన్నికల ప్రలోభాలకు గురిచేసే వస్తువులను సీజ్ చేశారు.
ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 786 రోడ్డు ప్రమాదాలు జరుగగా 380 మంది మృతిచెందారు. 8,374 మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేసి ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి వాటి నిర్మూలనకు కృషి చేశామని జిల్లా పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక లైట్లు, సిగ్నల్స్ ఏర్పాటుతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పోలీసు ప్రజావాణి నిర్వహించగా.. 2,270 ఫిర్యాదులు వచ్చాయి. వాటినన్నింటినీ పరిష్కరించారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న నలుగురిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేశారు.
భరోసా కేంద్రం ద్వారా 19మంది బాధితులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇప్పించారు. నేరాలను నిరోధించేందుకు జిల్లాలో 6,066 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఒక రాబరీ, రెండు హత్యాయత్నం, 9 గంజాయి కేసులను గుర్తించారు. వివిధ దొంగతనాల కేసుల్లో 25 తులాల బంగారం, 4.33 కోట్ల రూపాయల నగదు, 10 ఫోర్ వీలర్ వాహనాలు, 4 బైక్లు, 116 సెల్ఫోన్లు రికవరీ చేశారు. 646.5 కిలోల గంజాయి, 15.45 టన్నుల రేషన్ బియ్యం, నకిలీ విత్తనాలను సీజ్ చేశారు.