మాడ్గులపల్లి, మార్చి 23 : మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒళ్లు నొప్పులు, చర్మంపై మచ్చలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్థానికంగా సరైన వైద్యం అందకపోవడంతో బాధితులు నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వేలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోతున్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా మందులు ఆపిన తరువాత మళ్లీ తిరగబడుతున్న పరిస్థితి.
ఇందుగుల గ్రామ జనాభా సుమారు 2వేలు. అందులో దాదాపు 1800 మంది జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురిని ఈ అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తున్నది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ రోగం వ్యాప్తి చెందుతున్నది. మొదట ఒళ్లు నొప్పులతో ప్రారంభమై ఆ తర్వాత జ్వరం వచ్చి తగ్గకపోవడంతో బాధితులు బాగా నీరసించి మంచానికే పరిమితమవుతున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులతోపాటు శరీరం నల్లగా కావడం, నల్లటి మచ్చలు ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. భరించలేని కాళ్లు, కీళ్ల నొప్పులతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
గ్రామంలో మూడు నెలలుగా ప్రజలు అంతుచిక్కని రోగంతో సతమతమవుతున్నా వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయకుండా ఉన్న సిబ్బందితోనే నామమాత్రపు సేవలు అందిస్తూ చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జ్వరం వచ్చిందని వెళ్తే మాత్రలు ఇచ్చి సరిపెడుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రెండు నెలలుగా 125 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు రిపోర్టు ఇవ్వలేదని, వ్యాధి నిర్ధారణ చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు, మూడు రోజుల క్రితం డీఎంహెచ్ఓతోపాటు రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ శివబాలాజీరెడ్డి గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించినప్పటికీ వ్యాధి ఏమిటో, ఎందుకు వస్తుందో నిర్ధారణ చేయలేదు. వ్యాధి నిర్ధారణకు తాగునీటి శాంపిల్స్, రక్త నమూనాలను ల్యాబ్కు పంపించామని చెప్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించినప్పటికీ సరైన వైద్య సేవలు అందడం లేదని గ్రామస్తులు అంటున్నారు.
మా ఊరిలో మూడు నెలలుగా మాయదారి రోగం వెంటాడుతున్నది. జ్వరం, ఒళ్లు నొప్పులతో ఊరంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోగంతో నా ఆరోగ్యం బాగోలేదు. పట్నానికి వెళ్లి వైద్యం చేయించుకోవడంతో రూ.25వేల ఖర్చయింది. మాత్రలు వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. తరువాత మళ్లీ తిరగబడుతుంది. అసలు ఆ రోగమేందో ఎవరూ చెప్పడం లేదు. ఊర్లో వైద్యులు నామమాత్రంగా వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మాకు సరైన వైద్యం అందించి ఆదుకోవాలి.
– ఇండ్ల యాదమ్మ, ఇందుగుల గ్రామం
గ్రామస్తులు అనారోగ్యంతో బాధపడుతుండగా గతంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. బాధితులు ఎక్కువ కావడంతో వారి నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నాం. డెంగీ, టైఫాయిడ్, మలేరియా, చికున్ గున్యా లక్షణాలు కనిపించడంతో రక్త పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వస్తున్నాయి. మూడు నెలల నుంచి 231 రక్త నమూన పరీక్షలు చేయగా 4 టైఫాయిడ్, ఒకటి డెంగీ, రెండు ఆర్ఎఫ్టీ పాజిటివ్ వచ్చాయి. అపరిశుభ్రత వల్ల దోమల లార్వాలు వృద్ధి చెందుతుండడం, ఆ నీటిని తాగడం వల్ల వ్యాధులు వస్తున్నాయి. బాధితులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. కనీసం రెండు నుంచి మూడు వారాల వరకు మందులను తప్పనిసరిగా వాడాలి. నొప్పులకు స్టెరాయిడ్స్ వాడడం వల్ల ముఖం నల్లబడుతుంది. మందులు వాడితే నొప్పి తగ్గుతుంది.. ఆ తరువాత నల్లటి మచ్చలు కూడా పోతాయి. నాన్ స్పెసిఫిక్ వైరల్ ఆర్థరైటిస్ వైరస్గా గుర్తించాం. దానికి తగ్గట్లుగా మందులు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
– ఫిర్దోస్, పల్లె దవాఖాన డాక్టర్, ఇందుగుల