యాదాద్రి భువనగిరి, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : చేనేత కార్మికులను రుణమాఫీ కష్టాలు వీడటంలేదు. యాదాద్రి జిల్లాలో రుణ మాఫీ అసంపూర్తిగానే మిగిలింది. కొందరికి మాఫీ కాగా.. మరికొందరికి పెండింగ్లో పడింది. బ్యాంకుల నిర్వాకంవల్లే మాఫీ ఆగిపోయిందని తెలుస్తున్నది. ఫలితంగా కార్మికులు రుణమాఫీకి దూరమయ్యారు. కొంత అప్పు తెచ్చి చెల్లించినా మాఫీ కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. నేతన్నలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతున్నది.
ఎట్టకేలకు నేతన్నలకు రుణవిముక్తి..
యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 10వేల మంది నేతన్నలు, అనుబంధ కార్మికులు ఉన్నారు. మగ్గాల ఏర్పాటుకు, ఉత్పత్తికి ముడి సరుకు కొనుగోలు కోసం రుణాలు తీసుకుంటారు. అయితే చేనేత రుణమాఫీ చేస్తామని 2024 సెప్టెంబర్ 9న హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ క్యాంపస్లో ఐఐహెచ్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లా నుంచి చేనేత జౌళి శాఖ అధికారులు రాష్ర్టానికి ప్రతిపాదనలు పంపించినా.. సర్కారు మాత్రం జాప్యం చేస్తూ వచ్చింది. గతేడాది మార్చిలోనే నిధులు మంజూరైనా మాఫీ మాత్రం చేయలేదు. ఇక మున్సిపల్ ఎన్నికల ముందు కేవలం మున్సిపాలిటీలోని కార్మికులకు.. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని నేతన్నలకు నిధులు విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 2380 మంది రుణమాఫీకి అర్హులు కాగా, ఇప్పటి వరకు 2290 మందికి మాఫీ చేశారు. ఎంత రుణం తీసుకున్నా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేశారు.
బ్యాంకుల నిర్వాకంతో పెండింగ్..
గతంలో రుణాలు తీసుకున్నోళ్లకు దాదాపు అందరికీ సజావుగానే మాఫీ చేశారు. నిబంధనల ప్రకారం రుణాలు తీసుకున్నోళ్ల వివరాలను చేనేత, జౌళి శాఖ బ్యాంకుల నుంచి తెప్పించుకుంది. ఎవరు రుణాలు తీసుకున్నారు..? ఎంత తీసుకున్నారు..? నిజంగానే చేనేత రుణాలేనా..? తదితర అంశాలతో వివరాలు తీసుకుంది. ఇందులో భాగంగా డాక్యుమెంట్లు సమర్పించాలని బ్యాంకులకు సూచించింది. కానీ బ్యాంకుల వద్ద ఇప్పటికే రుణాలు కట్టినోళ్ల వివరాలు డిలీట్ అయ్యాయి.
ప్రధానంగా కెనరా, ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ పరిస్థితి ఉంది. పోంచపల్లిలో 17,మోత్కూరులో 11, గుండాలలో 6, మిగతా ఇతర మండలాల్లో మాఫీ పెండింగ్లో ఉంది. జిల్లాలో వివిధ బ్యాంకుల్లో సుమారు 90 మంది వరకు నేతన్నల డాక్యుమెంట్లు దొరకలేదు. పత్రాలు లేకపోవడంతో చేనేత,జౌళి శాఖ అధికారులు మాఫీని నిలిపివేశారు. వీరికి సుమారు రూ. 65 లక్షల వరకు మాఫీ కావాల్సి ఉంది. ఇదే విషయమై నేతన్నలు అధికారులకు మొరపెట్టుకున్నా లాభం లేకుండాపోయింది. హైదరాబాద్లో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామమ్యర్ను కలిసినా ఫలితం దక్కలేదు. రెండో విడత రుణమాఫీలో పేర్లు చేర్చేందుకు ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతుండటం కొసమెరుపు.
రుణమాఫీ కాలే..
ముద్ర లోన్ తీసుకున్న చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు ఉన్న కార్మికులకు రుణం మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎస్బీఐలో లక్ష తీసుకున్నా ఇంతవరకు రుణమాఫీ కాలే. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న. రెండో విడతలో మాఫీ అయితదని సమాధానం చెబుతారు. అందరికీ అయింది గానీ నాకు మాత్రం మాఫీ కాలే. అధికారులు దయచేసి రుణమాఫీ చేయాలి.
-నక సంగీత , చేనేత కార్మికురాలు, భూదాన్ పోచంపల్లి
ఏడీ ఆఫీసు నుంచి లిస్టు పంపలే..
తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో రూ.1,50,000 రుణం తీసుకున్న. రుణమాఫీ అయితది అంటే మొత్తం చెల్లించా. బ్యాంకు నుండి అర్హులైన రుణం పొందిన చేనేత కార్మికుల లిస్టును జిల్లా చేనేత జౌళి శాఖ ఆఫీసుకు పంపించారు. చేనేత జౌళి శాఖ ఏడీ ఆఫీసు నుంచి బ్యాంకుకు రుణమాఫీకి సంబంధిచిన లిస్టును పంపలేదు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్, రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, ఏడీ దృష్టికి తీసుకెళ్లాం. నేటికీ రుణమాఫీ కాలేదు.
-ఆటిపాముల మహేందర్, భద్రావతి కాలనీ, భూదాన్ పోచంపల్లి
నేతన్నలకు న్యాయం చేయాలి
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. 50 వేల రుణం తీసుకున్న. ఇంతవరకు రుణమాఫీ కాలే. పలుసార్లు అధికారులకు విన్నవించా. ష్యూరిటీ కోసం చెకులు కూడా తీసుకున్నారు. ఇంకా రిటర్న్ ఇవ్వలే. మాఫీ అవుతుందని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నాం. చేనేత బతుకులే అంతంత. సర్కారు చొరవ తీసుకోవాలి. రుణమాఫీ చేసి కార్మికులకు న్యాయం చేయాలి.
-బైరు జయప్రద, చేనేత కార్మికురాలు, భూదాన్ పోచంపల్లి