భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 29 : రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి కోరారు. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అటవీశాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు సమీపంలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.3.50కోట్లతో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీ సముదాయ భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భవనాన్ని కలియతిరిగి పరిశీలించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు గ్రామాల పరిధిలో అడవులు నశించిన ప్రాంతాల్లో పునరుజ్జీవం కార్యక్రమం కింద మొక్కలు నాటాలని సూచించారు.
28శాతానికి పెరిగిన అటవీశాతం
హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనం 33శాతం లక్ష్యాన్ని ఎంచుకోగా ఇప్పటి వరకు 24శాతం నుంచి 28శాతానికి పచ్చదనం పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో 33శాతం హరితహారం సాధిస్తామని పేర్కొన్నారు. తద్వారా వర్షాలు సకాలంలో కురవడంతో పాటు, వాతావరణ సమతుల్యం ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక శ్రద్ధతో ట్రాక్టర్స్, ట్యాంకర్స్ సమకూర్చి చెత్త తరలించడం, మొక్కలకు నీరందించడం, సంరక్షించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఫారెస్టు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 15వేల నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.
80శాతం మొక్కల సంరక్షణ
ఇప్పటి వరకు రాష్ట్రంలో 230కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం ఉండగా ఇప్పటికే 249కోట్ల మొక్కలు నాటగా వీటిలో 80శాతం సంరక్షించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన పచ్చదనం కనిపిస్తున్నదని, ఇందుకు అనుగుణంగా రాష్ర్టానికి జాతీయ అవార్డులు వస్తున్నాయన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల పాత్ర అమోఘమని కొనియాడారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ఇందుకు అందరిని అభినందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్పర్వేటర్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్తివారీ, జిల్లా సర్కిల్ ఫారెస్టు కన్పర్వేటర్ శివానీడోగ్ర, జిల్లా అటవీ అధికారి ఐ.పద్మజారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, భువనగిరి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ కె.కిరణ్కుమార్, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ.కిరణ్కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీల ఓంప్రకాశ్గౌడ్, తాజ్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.