నార్కట్పల్లి, మే 3 : మండలంలోని నక్కలపల్లి గ్రామంలో బుధవారం డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం పండుగలా సాగింది. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 64 కుటుంబాలతో గృహ ప్రవేశాలు చేయించారు. సొంతింటికి సంబురంగా వెళ్లిన లబ్ధిదారులు పాలు పొంగించి పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇండ్లు దక్కడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నక్కలపల్లి గ్రామంలో ఇండ్లు లేని పేద కుటుంబాలకు 80 ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులంతా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉండాలని, గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తిని వచ్చే ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ మండలంపై తనకంటే జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డికి ప్రేమ ఎక్కువ అని, తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోటీ 50 లక్షలతో భూమిని కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించడం సంతోషంగా ఉన్నదని అన్నారు. గుంట భూమి కోసం తగాదాలు పెట్టుకునే ఈ రోజుల్లో రెండెకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వడం గ్రామ ప్రజల అదృష్టమని, అందుకు నరేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లెంలలో త్వరలో డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి కుటుంబానికీ ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
పేదలకు అండగా సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తారని తెలిపారు. 2009లో తాను జడ్పీటీసీగా ఉన్నప్పుడు నక్కలపల్లి మారుమూల గ్రామంగా ఉండేదని, నేడు ఆదర్శంగా తయారైందని, ఆ ఘనత జడ్పీ చైర్మన్దేనని కొనియాడారు. కొంతమంది దొంగ యాత్రలతో ఊళ్లల్లోకి వస్తున్నారని, ప్రజాదరణ లేని వారిని నమ్మవద్దని సూచించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్ ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే మోడల్ సిటీగా తయారైందన్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, హౌజింగ్ పీడీ రాజ్కుమార్, పీఆర్ ఈఈ తిరుపతయ్య, తాసీల్దార్ పులి సైదులు, ఎంపీడీఓ యాదగిరి, పీఏసీస్ చైర్మన్ బండా జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ ఈద మాధవీ నర్సింహ, ఎంపీటీసీ కనుకు అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు యానాల అశోక్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.