హుజూర్నగర్, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనే ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణ యుగమని, మేలు చేసిన సీఎం కేసీఆర్ను గిరిజన జాతి మరువవద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. బుధవారం ఆమె పట్టణంలో రూ.1.5కోట్లతో నిర్మించిన బంజారా భవన్ను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో 3,144 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు, రూ.2వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు వేయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తండాలకు కృష్ణా జలాలు తెప్పించి ఫ్లోరైడ్ నుంచి ప్రజలకు మిముక్తి కల్పించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల అమలుతో ప్రస్తుతం ప్రకటించిన 91వేల ఉద్యోగాల్లోనే 6వేల నుంచి 9వేలకు ఉద్యోగాల సంఖ్య పెరిగిందని తెలిపారు. వీటితో పాటు మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు అదనంగా వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ పెంచడానికి ఎందుకు జాప్యం చేస్తున్నదని ప్రశ్నించారు. గిరిజనులపై కేంద్రానికి ప్రేమ ఉంటే తెలంగాణ మాదిరిగా వెంటనే దేశంలో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి తండాకు గుడి కట్టిస్తామని చెబుతున్న బీజేపీ నాయకులు హైదరాబాద్లో సీఎం కేసీఆర్ కట్టించిన మాదిరి ఢిల్లీలో బంజారా భవన్ను నిర్మించి, సేవాలాల్ జయంత్యుత్సవాలను దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో హుజూర్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ జయబాబు, వైస్ చైర్మన్లు శ్రీలతారెడ్డి, జక్కుల నాగేశ్వర్రావు, ఎంపీపీలు పార్వతీకొండానాయక్, పెండెం పద్మ, జడ్పీటీసీలు జగన్నాయక్, సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు చంద్రమౌళి, నగేశ్, నవీన్నాయక్, రమేశ్ మహారాజ్, పార్టీ నాయకులు అమర్నాథ్రెడ్డి, అమర్, కేఎల్ఎన్రెడ్డి, పద్మ పాల్గొన్నారు.
లంబాడీ భాషను అధికార భాషగా కేంద్రం గుర్తించాలి
దేశంలో 14కోట్ల మంది గిరిజనులు మాట్లాడుతున్న లంబాడీ భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా కేంద్రం గుర్తించాలన్నారు. విభజన చట్టం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో 40లక్షల మంది ఉన్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15,232 కోట్లు కేటాయిస్తే దేశవ్యాప్తంగా 15కోట్లు ఉన్న గిరిజనులకు మోదీ ప్రభుత్వం 12వేల కోట్లు కేటాయించడం సిగ్గు చేటన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు కోసం వచ్చే రాజకీయ నాయకులను గిరిజనులు ప్రశ్నించాలన్నారు. తెలంగాణలో వచ్చే నెలలో పోడు భూముల రైతులకు పట్టాలు అందిస్తామని తెలిపారు. గిరిజనులు సైదిరెడ్డికి అండగా నిలవాలని కోరారు. హుజూర్నగర్కు 10రోజుల్లో గిరిజన గురుకులను మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా గిరిజన్ భవన్లో డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు, మట్టపల్లిలో గిరిజన అన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు.
గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ గిరిజనుల పక్షపాతిగా నిలిచిపోతారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఆయనకు సాటి ఎవరూ లేరని కొనియాడారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి తండాలో సీసీ రోడ్డు వేయించామన్నారు. జిల్లాలో గిరిజనుల కోసం బంజారా భవన్ చేయడం సంతోషకరమన్నారు. గిరిజనుల నాగరికతను మానవజాతికి చాటిన ఘనుడు సంతు సేవాలాల్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతిఒక్కరూ పయనించాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమన్నారు.
-ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్