యాదగిరిగుట్ట, మార్చి17 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నరసింహస్వామిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాలు ఉంచి అష్టోత్తర నామాలు పఠించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది.
ప్రధానాలయంలో సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు నిర్వహించారు. రాత్రివేళ స్వామివారికి తిరువారాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలోని అద్దాల మండపంలో అమ్మవారిని బంగారు అభరణాలు, పట్టువస్ర్తాలతో ఆలంకరించి హారతి ఇచ్చారు. అనంతరం తిరుమాఢవీధుల్లో సేవను ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ఖజానాకు రూ.17,29,300 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,27,250
వీఐపీ దర్శనాలు 30,000
బ్రేక్ దర్శనం 1,02,600
వేద ఆశీర్వచనం 9,000
సుప్రభాతం 4,200
ప్రచార శాఖ 10,850
వ్రత పూజలు 75,200
కల్యాణకట్ట టిక్కెట్లు 50,000
ప్రసాద విక్రయం 5,90,870
వాహన పూజలు 8,700
అన్నదాన విరాళం 14,950
సువర్ణ పుష్పార్చన 45,716
యాదరుషి నిలయం 40,512
పాతగుట్ట నుంచి 18,920
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
శివాలయం 6,500
పుష్కరిణి 950
ఇతర విభాగాలు 3,93,082