యాదాద్రి, డిసెంబర్ 20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణతంతు నిర్వహించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు.
సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాత గుట్ట స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా సాగాయి. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు.
తమలపాకులతో అర్చన చేపట్టారు. స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ధునుర్మాసోత్సవాల్లో భాగంగా ఉదయం 4.30 నుంచి 5.15 గంటల వరకు అర్చకులు వేద మంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 17 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.21,66, 894 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి రూ.1.16 లక్షల విరాళం సమకూరింది. భువనగిరికి చెందిన కృష్ణంరాజు కుటుంబ సభ్యులు సంబంధిత చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,73,276
వీఐపీ దర్శనాలు 1,65,000
బ్రేక్ దర్శనం 1,00,200
వేద ఆశీర్వచనం 13,200
నిత్య కైంకర్యాలు 2,001
సుప్రభాతం 3,900
ప్రచార శాఖ 46,200
వ్రత పూజలు 72,000
కల్యాణకట్ట టిక్కెట్లు 59,300
ప్రసాద విక్రయం 10,87,320
వాహన పూజలు 12,400
అన్నదాన విరాళం 27,719
శాశ్వత పూజలు 12,500
సువర్ణ పుష్పార్చన 90,264
యాదరుషి నిలయం 79,848
పాతగుట్ట నుంచి 31,950
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
శివాలయం 6,800
ఇతర విభాగాలు 2,116