యాదగిరిగుట్ట, జనవరి 9 : యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం సోమవారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణ పుష్పార్చనలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామి వారికి తిరువీధి, దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి వేళలో స్వామివారికి తిరువారాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు.
పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పరమశివుడు, స్పటిక లింగేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. గోదాదేవి రంగనాయకుడిపై రచించిన పాశురాలను పటిస్తూ అర్చకులు మార్గళి పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 15వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ. 22,84,748 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదగిరిగుట్ట ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వరకు అక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. యాదగిరీశుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వాటిల్లకుండా, చోటు చేసుకున్నప్పుడు చేపట్టాల్సిన చర్యలపై ఆడిషనల్ ఎస్పీ భరత్ ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 70మంది అక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. స్వామివారి ఆలయాన్ని మూసివేసిన అనంతరం అర్ధరాత్రి 2గంటల వరకు మాక్ డ్రిల్ చేపట్టారు. కొండపైన గల హరిత హోటల్ నుంచి ప్రధానాలయం వరకు పలు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ను పూర్తి చేశారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 9,17,500
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,71,050
వీఐపీ దర్శనాలు 1,20,000
బ్రేక్ దర్శనాలు 73,500
వేద ఆశీర్వచనం 11,400
నిత్య కైంకర్యాలు 5,002
సుప్రభాతం 1000
ప్రచార శాఖ 25,550
వ్రత పూజలు 60,800
కల్యాణకట్ట టిక్కెట్లు 64,100
ప్రసాద విక్రయం 12,45,800
వాహనపూజలు 14,300
అన్నదాన విరాళం 22,907
శాశ్వత పూజలు 10,000
సువర్ణ పుష్పార్చన 78,780
యాదరుషి నిలయం 30,464
పాతగుట్ట నుంచి 20,010
కొండపైకి వాహన ప్రవేశం 3,00,000
శివాలయం 11,800
ఇతర విభాగాలు 16,985