నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో టికెట్ల లొల్లి జోరుగా సాగుతున్నది. తొలి జాబితాలో కీలక నేతలంతా తమ స్థానాలను పదిల పరుచుకోగా రెండో జాబితాలో మాత్రం తమ ప్రభావాన్ని చూపుతూ పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో పెద్ద రచ్చే మొదలైంది. కాంగ్రెస్ జెండాను కిందపడేసి బీజేపీ జెండాను ఎత్తుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఉప ఎన్నికలో పార్టీ కార్యకర్తల పైనే కేసులు పెట్టిస్తే ఆయనకే తిరిగి టికెట్ ఎలా ఇస్తారన్న ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు టికెట్ ఆశించి భంగపడ్డ పీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తన అనుచరులతో భేటీ అయ్యి పార్టీ పెద్దలపై మండిపడ్డారు.
పరాయిగడ్డ నుంచి వచ్చిన రాజగోపాల్రెడ్డి మునుగోడులో రాజ్యమేలుతానంటే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. శనివారం చలమల కృష్ణారెడ్డి ఓ సెల్ఫీ వీడియోను రిలీజు చేయడంతో పాటు సాయంత్రం పార్టీ కార్యకర్తలు, అనుచరులతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పెద సంఖ్యలో తరలివచ్చిన అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకు తన భవిష్యత్ కార్యచరణ ఉంటుందని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బరిలో ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సచ్చిన శవం అని చెప్పి జెండా కిందపడేసి వెళ్లిన రాజగోపాల్రెడ్డి తిరిగి వస్తే.. ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వైరస్లా మారారని మండిపడ్డారు. వాళ్లిద్దరి కుటుంబాల్లో రెండేసి టికెట్లు తీసుకుని పార్టీ జెండా మోసిన వారికి మెండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన తమ్ముడి ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను బొందపెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఏం పని చేయకుండా పార్టీని వదిలేసి వెళ్లిన రాజగోపాల్రెడ్డికి మళ్లీ ఎలా టికెట్ ఇస్తారంటూ కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు. ‘మన పార్టీ జెండా కింద పడిపోతుంటే.. పడిపోయిన జెండాను 15 నెలల నుంచి మోసి, క్యాడర్ను నిలబెట్టి, పార్టీని నిలబెట్టి, మంచికి చెడుకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్లను మోసం చేస్తరని అనుకోలేదననారు. మమ్మల్ని మోసం చేసిన వాళ్లు అంతకుఅంతకూ అనుభవిస్తన్నారు. రాజగోపాల్రెడ్డి లాంటి దుర్మార్గులకు దయచేసి సరైన గుణపాఠం చెప్పాలన్నారు.
దయచేసి మేధావులు, విద్యావంతులు, ఓటర్లు ఆలోచించాలని కోరారు. తాను మాత్రం ఖచ్చితంగా మునుగోడు బరిలో ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలను కాపాడుకుంటా.. తనకు టికెట్ వచ్చినా రాకపోయిన బరిలో ఉంటానన్నారు. రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ సచ్చింది అని కింద పడేసి.. మళ్లీ పచ్చగుందని చెప్పి కాంగ్రెస్కు వచ్చిండు. ఆయన స్వార్థం గురించే పార్టీలను వాడుకుంటున్నడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డగా చెప్పుతున్నా.. ఎవడో పరాయివాడు వచ్చి మునుగోడును ఏలుతనంటే ఊరుకునేది లేదని, కార్యకర్తలు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి ఉదయ్పూర్ డిక్లరేషన్ పేరుతో ఇన్నాళ్లు బీసీలను ఊరించి ఊరించి ఊసురుమనిపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకే ఒక్క సీటు మాత్రమే బీసీలకు కేటాయించి మోసం చేశారు. ఆలేరులో మాత్రమే బీర్ల అయిలయ్యకు టికెట్ కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో ఎస్టీ, ఎస్సీ రిజర్వ్ మూడు మినహాయిస్తే మిగతా అన్నిచోట్ల ఒకే సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతలే అభ్యర్థులయ్యరు. ఇందులో ఒక్కో కుంటుంబ నుంచి ఇద్దరేసి చొప్పున ఉండడం గమనార్హం. ఎన్నికల షెడ్యూల్కు నెల రోజుల ముందు నుంచి ఒక్కో పార్లమెంట్ స్థానంలో రెండు సీట్లను బీసీలకు ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పలుమార్లు ప్రకటిస్తూ వచ్చారు.
అవసరమైతే తన నల్లగొండ టికెట్ను సైతం త్యాగం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తీరా తన టికెట్ తానే తీసుకోవడమే కాకుండా ఒకే ఒక్క టికెట్తో బీసీలను సరిపెట్టారు. భువనగిరిలోనూ బీసీలకే టికెట్ అంటూ పంజాల రామాంజనేయులుగౌడ్, పచ్చిమట్ల శివరాజ్గౌడ్ లాంటి నేతల్లో ఆశలు రేకెత్తించారు. కుంభం అనీల్కుమార్రెడ్డి బీఆర్ఎస్లోకి రాగానే వీళ్లతో డబ్బులు కూడా ఖర్చు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటివరకు బీసీ నేతలను పావుగా వాడుకుని తిరిగి కాంగ్రెస్లోకి వచ్చిన కుంభం అనీల్కుమార్రెడ్డితో ఒప్పందం కుదరగానే వారిని విస్మరించారన్న చర్చ సాగింది.
ఇప్పటివరకు ప్రకటించిన తొమ్మిది స్థానాల్లో ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ అభ్యర్థి కాగా మిగతా ఆరుగురు రెడ్డి సామాజిక వర్గం నేతలే. మిగిలిన మిర్యాలగూడను పొత్తులో భాగంగా సీపీఎంకు, సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డిలో ఒకరు, తుంగతుర్తిలో ఎస్సీ రిజర్డ్గా ఉన్నది. కాగా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కిందటి మాదిరిగానే కోదాడ, నాగార్జునసాగర్ నియోజక వర్గాలను బీసీలకు కేటాయించి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నది. సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే అనేక మంది నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదవులు కట్టబెట్టిన విషయం తెలిసిందే.