మేళ్లచెర్వు, ఫిబ్రవరి 21 : మహా శివరాత్రి జాతరను పురస్కరించుకుని స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం నాల్గొవ రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలను అర్చకులు వేదమంత్రాలతో శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో శ్రీ మాతా చారిటబుల్ ట్రస్ట్ కొంకపాక రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహాయాగంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి దంపతులు సర్పయాగ పూజలు జరిపించారు. మూడు రోజులుగా ఆలయానికి రూ.12,04,874 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దేవాలయ విశిష్టతను వివరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈఓ కొండారెడ్డి స్వామివారి శేష వస్ర్తాలతో సత్కరించారు. అనంతరం జాతరలో భాగంగా నిర్వహిస్తున్న ఎద్దుల పందేలను జెన్కో సీఎండీ కాసేపు వీక్షించారు. అంతకుముందు కొంకపాక రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి యాగంలో పాల్గొన్నారు.
ఎడ్ల పందేలలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం వరకు ఆరుపళ్ల విభాగంలో పోటీలు జరుగగా అనంతరం న్యూ కేటగిరీ విభాగంలో పోటీలు రసవత్తరంగా సాగాయి. ఆరు పళ్ల విభాగంలో హైదరాబాద్కు చెందిన ఆర్ఆర్బుల్స్ రోహన్బాబు ఎద్దులు ప్రథమ, వినుకొండకు చెందిన బత్తుల చిన్నబ్బాయి గిత్తలు ద్వితీయ, సంతనూతలపాడుకు చెందిన తేజస్వీరెడ్డి గిత్తలు తృతీయ బహుమతులను గెలుచుకున్నాయి. మరోవైపు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆయా కార్యక్రమాలలో సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వర్రా వెంకట్రెడ్డి, సభ్యులు, దాతలు పాల్గొన్నారు.
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల్లో పలువురు ప్రో కబడ్డీ ఆటగాళ్లు సందడి చేశారు. తెలుగు టైటాన్స్కు చెందిన సిద్దార్ధ్దేశాయ్, మల్లికార్జున్, పాట్నా పరైట్స్కు చెందిన మోను సంధు, యూపీ యోధాకు చెందిన అసు సింగ్ మైదానంలో సందడి చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే జట్టుకు వారు ప్రాతినిధ్యం వహించనున్నారు. నిర్వాహకులు, అభిమానులు వారికి ఘన స్వాగతం తెలిపారు.