ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలి
కలెక్టర్ పమేలా సత్పతి
సమీకృత కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ కార్యాలయం ప్రారంభం
ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలందించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. శుక్రవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. వైద్య వృత్తి ఎంతో గొప్పదని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా ఆరోగ్యంతోనే కుటుంబ సంపద
చౌటుప్పల్ రూరల్, జూలై 1 : మహిళా ఆరోగ్యంతోనే కుటుంబ సంపద మరింత పెరుగుతున్నదని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం మండలంలోని కొయ్యలగూడెం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషకాహార వారోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అక్షారభ్యాసం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన కుటుంబ నిర్మాణానికి మహిళలలే కీలకమన్నారు. ఇందుకోసం మొదటగా వారు భోజనం చేసిన తర్వాతనే పిల్లలకు, భర్తకు అందించాలన్నారు. సకాలంలో ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని అక్కడే తీసుకోవాలన్నారు. ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అందిచడం సరైంది కాదన్నారు.
భవిష్యత్ను ఉన్నతంగా మలుచుకోవాలి
భువనగిరి కలెక్టరేట్ : విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి భవిష్యత్ను ఉన్నతంగా మలుచుకోవాలని కలెక్టర పమేలాసత్పతి సూచించారు. ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన టైమ్స్ కళాశాల విద్యార్థిని రుహీనాను కలెక్టర్ కార్యాలయంలో అభినందించి మాట్లాడారు. ఇంటర్ సెకండీయర్ ఎంపీసీలో 987/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలవడం సంతోషకరమన్నారు. ఆమె వెంట కళాశాల నిర్వాహకులు మోనూ, సోనూ ఉన్నారు.
‘టీచ్ ఫర్ ఇచ్’ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
వివిధ యాజమాన్యాల కింద ఉన్న మండల ప్రాథమిక, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో 50 పాఠశాలలను టీచ్ ఫర్ ఇచ్ సంస్థ దత్తత తీసుకోవడం సంతోషకరమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ క్లాస్రూంల తోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అన్నారు. ప్రధానోపాధ్యాయులు సంస్థ నియమాలను తప్పక పాటించాలన్నారు. బుధవారం సంబంధిత అధికారులు పాఠశాలలను సందర్శించి కార్యక్రమ అమలుతీరును పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, డీఈఓ నారాయణరెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కార్యక్రమాల్లో ఆదనపు కలెక్టర్లు దీపక్తీవారి, శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, ఆర్డీఓ సూరజ్కుమార్, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, సీడీపీఓ శైలజ, మున్సిపల్ కమిషనర్ నర్సింహారెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, డీటీ ఇబ్రహిం, ఆర్ఐ రాంరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.