మిర్యాలగూడ రూరల్, డిసెంబర్ 1 : మండలంలోని లావూడితండాలో సారా తయారీ స్థావరాలను ధ్వంసం చేసేందుకు వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై గురువారం సారా తయారీదారులు దాడి చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు.. లావూడితండాలో సారా తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎస్ఐ లావణ్య సిబ్బందితో కలిసి రాత్రి ఏడుగంటలకు వెళ్లారు.
సిబ్బంది తండాలో సోదాలు నిర్వహించగా లావూడి రమేశ్ ఇంట్లో 30 లీటర్ల బెల్లం పానకం, ఆరు లీటర్ల సారా లభించింది. వాటిని స్వాధీనం చేసుకున్న సిబ్బంది పంచనామా అనంతరం నిందితుడిని సంతకం చేయమని చెప్పగానే అతను ఒక్కసారిగా వాహనంపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు ఎస్ఐ సెల్ఫోన్ లాక్కొని పగులగొట్టాడు. అతడిపై రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్ఐ లావణ్య తెలిపారు. అయితే ఎక్సైజ్ అధికారులపై దాడి చేసిన రమేశ్ ఆత్మహత్యాయత్నం చేయగా స్థానికులు అడ్డుకొని ఏరియా ఆస్పత్రిలో చేర్పించినట్లు గ్రామస్తులు తెలిపారు.