ప్రస్తుతం ఎండల కారణంగా చెరువుల్లో నీటి పరిమాణం తగ్గిపోతుంది. దాంతో ఆక్సిజన్ బాగా తగ్గి చేపలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెరువుల్లో ప్రాణ వాయువును పెంచి చేపలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మండు వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త బూర్గు లవకుమార్ పలు సూచనలు చేశారు.
– గరిడేపల్లి, మే 25
సాధారణంగా చేపల చెరువుల్లో అధిక మోతాదులో వేసిన మేతలు, ఎరువుల వల్ల చెరువు మట్టిలో పాస్ఫరస్ బంధించబడి నత్రజని వాతావరణంలో కలిసి పోయి ప్రధానమైన పోషక పదార్థాలు వృథా అవుతాయి. దీంతోపాటు వృక్ష ప్లవకాలు (పైటో ప్లాంక్టాన్) ఉధృతంగా పెరిగి నీళ్లు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి సూర్యరశ్మి నీటి అడుగు భాగానికి ప్రసారం కాదు. దీంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి చెరువుల్లో ఉత్పాదక శక్తి తగ్గుతుంది.
ఆక్సిజన్ కొరతకు కారణాలు
నివారణోపాయాలు
చెరువుల్లో నిరంతరం ప్రాణవాయువు లభ్యమవుటకు స్ప్రింక్లర్, కంప్రెషర్, సాడిల్ వీల్ వంటి యాంత్రిక ఏరేటర్లను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా చెరువు నీటిలో జరుగు ప్రాణవాయువు స్థాయి మార్పులను నివారించి ఎరువులను సమర్థ్దవంతంగా వినియోగించుకోవచ్చు. సాడిల్ వీల్ ఉపయోగించడం ద్వారా నీటిలో కరిగిన ప్రాణవాయువులు నాలుగు గంటల్లో లీటర్కు నాలుగు మిల్లీగ్రాముల స్థాయికి పెంచి చేపలకు హాని జరుగకుండా కాపాడవచ్చు. నీటిలో కరిగిన ప్రాణవాయువు స్థాయి అనుకూలంగా ఉన్నప్పుడు చేపల శరీరంలోనే జీవక్రియలు ఉధృతమై ఆహార సేకరణ వినియోగం హెచ్చుగా ఉంటుంది. దీంతో చేపల పెరుగుదల బాగుంటుంది.
ప్రస్తుతం ఎండల కారణంగా వాతావరణంలో వేడి హెచ్చుగా ఉండి చెరువుల్లో నీటి లోతు తక్కువగా ఉంటుంది. కావున ఎరువుల నెలసరి మోతాదును తగ్గించడం గానీ, ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం గానీ చేయాలి. చెరువులో ఇంకిపోయిన, పైకి ఆవిరైపోయి తగ్గే నీటి పరిమాణాన్ని నిత్యం గమనిస్తూ కొత్త నీటితో నింపుతూ ఉండాలి. అదేవిధంగా చెరువుల్లో ప్రతి ఒకటిన్నర రెండు నెలలకోసారి చెరువులోని పాత నీటిని బయటకు వదిలి కొత్త నీటితో నింపాలి. మురుగు కాల్వలు, పరిశ్రమల నుంచి వెలువడిన కలుషిత నీటిని చెరువుల్లోకి పంప్ చేయరాదు. చెరువుల్లో తగు మోతాదులో మాత్రమే చేపల మేత, ఎరువులను వాడాలి.
ఎరువులు, మందుల వాడకం తర్వాత చెరువు నీటిలో బాగా కదలికలు కలుగజేయాలి. సూర్యరశ్మి ఎక్కువ ఉన్న మధ్యాహ్న సమయంలో ఎరువులు, మందుల వాడకం మంచిది. చెరువు నీటి ఉపరితలంపై చెత్త మొదలైనవి పడినప్పుడు వెంటనే తొలగించాలి. నీటిలో అధికంగా పెరిగే నీటి మొక్కలను, ప్లవకాల తెట్టును నిర్మూలించాలి. నీళ్లు మార్చడానికి వీలు లేకపోతే ఎకరానికి సుమారు 40 కిలోల సున్నం చెరువంతా చల్లాలి. ఆయిల్ ఇంజన్ లేదా మోటర్ పంపుసెట్ల సహాయంతో చెరువులోని నీటిని తోడి అదే చెరువులో పోయడం (రీ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్)తో నీటిని అలజడి చేయడం వంటివి చేయాలి. పైన తెలిపిన జాగ్రత్తలు పాటించడం ద్వారా తగినంత ప్రాణవాయువు లభించడంతోపాటు ఆరోగ్యవంతమైన చేపల దిగుబడులు పొందవచ్చు.
పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి
చేపల చెరువుల్లో మేత, ఎరువులను అధికంగా ఉపయోగిస్తే పోషక పదార్థాలు ఎక్కువగా లభించి వృక్ష ప్లవకాలు ఎక్కువగా పెరిగి చేపలకు ఆక్సిజన్ సరిగా అందక మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి చేపలు పెంచే చెరువును బాగా పరిశీలిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా తగు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో చెరువులో నీటి పరిమాణం తగ్గుతుంది. కాబట్టి ఆక్సిజన్ కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువులో ఆక్సిజన్ను ఉత్పత్తి చేసేందుకు స్రింక్లర్, కంప్రెషర్, సాడిల్ వీల్ను ఉపయోగించాలి. వీటికి తోడుగా చెరువులోఎరువుల వాడకం తగ్గించడం, నిలిపివేయడం వంటివి చేపట్టాలి. చేపల పెంపకంలో తగు జాగ్రత్తలు పాటిస్తే దిగుబడులు బాగా వచ్చి మంచి లాభాలు పొందవచ్చు.
– బూర్గు లవకుమార్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి