యాదాద్రి, అక్టోబర్ 23 : యాదాద్రీశుడి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపం, ప్రసాద విక్రయశాల వద్ద రద్దీ నెలకొంది. కొండ కింద కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ప్రసాద విక్రయశాల వద్ద స్వామివారి ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. స్వామివారి ధర్మదర్శానికి 2 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో.. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో, సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 32వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.33,22,514 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.