యాదాద్రి, జూన్ 19 : యాదాద్రి స్వయంభు క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యాదాద్రి ముఖమండపం, క్యూలైన్లు, ప్రాకార మండపాలు, మాఢ వీధులు భక్తులతో నిండిపోయాయి. దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు బారులు దీరారు. స్వయంభువును దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పంచనారసింహులతోపాటు, అనుబంధ శివాలయం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామివారిని సైతం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలో కూడా భక్తుల సందడి నెలకొన్నది. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి నిత్యారాధనల్లో, సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనాల్లోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. కొండకింద దీక్షా పరుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడికి నిత్యోత్సవాలు
స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారు జామున 3.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, స్వయంభువు మూర్తులకు అభిషేకం జరిపారు. అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం వెండి మొక్కుజోడు సేవలు, దర్బార్ సేవ చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సుమారు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.60,45,065 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వర్ణ తాపడ సింహాసనంపై లక్ష్మీనరసింహుడు
యాదాద్రి : దాతలు బహూకరించిన స్వర్ణ తాపడ సింహాసనంపై ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని అదిష్ఠింపజేశారు. అమెరికా న్యూయార్క్కు చెందిన దాతలు సామల స్వామి, వీరమణి రూ.18 లక్షలతో కల్యాణ సింహాసనాన్ని తయారు చేయించి అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎన్. గీత ప్రత్యేక పూజలు చేసి స్వామి, అమ్మవార్లను సింహాసనంపై అధిష్ఠింపజేసి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.