వైభవంగా నిత్యతిరుకల్యాణోత్సవం
శ్రీవారి ఖజానాకు రూ.42,68,960 ఆదాయం
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. సుమారు 41 వేల మంది భక్తులు రాగా ధర్మదర్శనానికి 3 గంటలు, 150 రూపాయల దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. కొండపైన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, మాఢ వీధులు, కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి భక్తులతో సందడిగా మారాయి.
యాదాద్రి, జూన్ 26 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. స్వామి ఆర్జిత పూజలు, స్వయంభూ దర్శనాలతో ఆలయం కిక్కిరిసిపోయింది. సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ తిరువీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున నిజాభిషేకంతో పాటు సాయంత్రం వెండి మొక్కు జోడు సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. స్వయంభువుడి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. సెలవు రోజు కావడంతో స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీక్షాపరుల మండపంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి నిత్యపూజలు తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి మొదలయ్యాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చక బృందం తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, స్వయంభువులకు అభిషేకం చేశారు. అనంతరం స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి 7గంటల నుంచి ఆరగంట పాటు స్వామికి తిరువారాధన నిర్వహించిన అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. స్వామి ధర్మదర్శనానికి 3గంటలు, రూ.150 దర్శనాలకు గంటన్నర సమయం పట్టింది. స్వామివారి ఖజానాకు రూ.42,68,960 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.గీత తెలిపారు. స్వామిని 41వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు.