యాదగిరిగుట్ట, జనవరి 29 : పంచనారసింహుడి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాలలో రద్దీ నెలకొన్నది. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహహోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులకు కొలుస్తూ హోమం జరిపారు.
అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారిని సుమారు 35 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ధర్మ దర్శనానికి 3గంటలు, ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారి ఖజానాకు రూ.45,56,920 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.