నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమ ఆగదని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హాలియా మున్సిపాలిటీలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం మెడలు వంచేదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువదలరని ఆయన హెచ్చరించారు.
రైతన్నకు అన్యాయం జరిగితే రైతు నాయకుడు కేసీఆర్ ఉపేక్షించరని పేర్కొన్నారు, నోటికి అడ్డు అదుపు లేకుండా రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడవుతున్నారని, వారిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఆది నుంచి మోదీ ప్రభుత్వం రైతన్నలపై చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు భాందవుడని, రైతుల సంక్షేమం కోసం ఎంతటి ఉద్యమానికైనా వెనకడబోరని ఆయన తెలిపారు.