నేరేడుచర్ల, డిసెంబర్ 5 : వానకాలం సీజన్ పంటల నూర్పిడి పూర్తి కావడంతో అన్నదాతలు యాసంగి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ముందస్తుగా వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే.. నాట్లు వేసేటప్పుడు తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సిరుల పంటలు పండించవచ్చని, లేదంటే దిగుబడులపై ప్రభావం పడే అవకాశముంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో నాట్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు.
వరి నాట్లు వేయడానికి సుమారు 3వారాల ముందు నుంచే పొలాన్ని తయారు చేసుకోవాలి. ట్రాక్టర్ లేదా ఎడ్ల నాగలితో ఒక సాలు దున్నిన తర్వాత నాలుగైదు రోజులకు మరో సాలు దున్నాలి. దీని వల్ల కలుపు మొక్కలు భూమిలో కలిసిపోయి పంటకు ఉపయోగపడుతాయి. హడావుడిగా పొలాన్ని సిద్ధం చేస్తే కలుపు మొక్కలు ఎక్కువై పంట దిగుబడిని దెబ్బతీస్తాయి. పచ్చి రొట్ట పైర్లు భూమిలో కలువడానికి సుమారు రెండు వారాల సమయం పడుతుంది. కాబట్టి ఆ పైర్లను భూమిలో కలియదున్నేటప్పుడు ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ వేసుకోవాలి.
పొలంలో నాటడానికి 4-6 ఆకులు కలిగిన వరి నారు ఆనుకూలం. బురద పదును ఉండేలా పొలాన్ని తయారు చేసుకొని 2-3 సెంటీ మీటర్ల లోతులో నాటితే మంచిది. ఎక్కువ లోతులో నాటితే పిలకలు రావడం ఆలస్యం అవుతుంది. పిలకల సంఖ్య తగ్గిపోతుంది. కుదురుకు 2-3 మొక్కలు కూడా నాటవచ్చు. నాటేటప్పుడు నారు తలలు తుంచితే మంచిది. సరైన వయసులో మొక్కలు నాటితే కొనలను కత్తిరించాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా చదరపు మీటరుకు దీర్ఘకాలిక రకాలైతే 33 కుదుళ్లు, మధ్యకాలిక రకాలైతే 44, స్వల్పకాలిక రకాలైతే 50 కంటే ఎక్కువ కుదుళ్లు ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు లేత నారును నాటుకోవడం మంచిది.
పొలాన్ని దున్నిన తర్వాత దమ్ము చేయాలి. బాగా దమ్ము చేస్తే నీటి వృథాను అరికట్టవచ్చు. కలుపు అదుపులో ఉంటుంది. పైరు అంతటికీ నీరు సమానంగా అందుతుంది. చివరి దమ్ములోనే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సిఫారసు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మొదటి దఫాగా వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులను దుక్కిలోనే వేసుకోవడం మంచిది. జింక్, భాస్వరం ఎరువులను ఒకేసారి వేయకుండా 2-3రోజుల తేడాతో వేసుకోవాలి. ప్రధాన పొలం గట్లపైన కలుపు మొక్కలు, గడ్డిని తీసివేయాలి.
నాట్లు వేసేటప్పుడు లేదా వేసిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీస్తే పైరుకు కావాల్సిన గాలి, వెలుతురు లభిస్తాయి. చీడపీడల ఉధృతి కొంత వరకు తగ్గుతుంది. ఎరువులు వేయడం, చీడపీడలు, కలుపు నివారణకు మందులు పిచికారీ చేయడం, పైరు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం తేలికవుతుంది.
నీటి యాజమాన్యం విషయంలో తగిన జగ్రత్తలు తీసుకుంటే పిలకలు సకాలంలో వచ్చి దిగుబడి బాగా వస్తుంది. నాట్లు వేసిన నాటి నుంచి పైరు మూస తిరిగే వరకు అంటే 20 రోజుల పాటు పొలంలో పలుచగా నీరు ఉండాలి. పొలంలో నీరు తగిన మోతాదులో ఉంటే సుడి దోమ, లద్దె పురుగుల తాకిడి పెద్దగా ఉండదు. తడి ఆరిపోతే కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయి. రసాయన ఎరువులు వేసేటప్పుడు పొలంలో నీళ్లు తక్కువగా ఉండాలి.
వరి నారు పోసిన నాటి నుంచి కోత కోసే వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. యాసంగిలో 25 రోజుల నుంచి 30 రోజుల వరి నారును నాటుకోవడం ఉత్తమం. నాటిన తరువాత పొలంలో ఉత్తర – దక్షిణ దిశలో కాలి బాటలను తీసుకోవాలి. వాటి వల్ల మొక్కలకు సరైన వెలుతురు, గాలి లభించడంతోపాటు ఎరువులు చల్లుకోవడానికి, మందులు పిచికారీ చేయడానికి వీలుగా ఉంటుంది. మొక్కల్లో రోగ లక్షణాలను గుర్తించి దానికి అనుగుణంగా తగిన మందులను సరైన మోతుదులో ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. ఇలా చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి