-కట్టంగూర్, డిసెంబర్ 21 :వానొచ్చి వాగు ఉధృతంగా ప్రవహిస్తే గ్రామాలు, వ్యవసాయ బావుల వద్దకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రజలు, రైతులు వాగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సమైక్య పాలనలో ప్రజలు వంతెన నిర్మాణం చేపట్టాలని నాటి సమైక్య పాలకులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులు వెచ్చించి వంతెన నిర్మాణం పూర్తి చేయడంతో దశాబ్దాల కాలం నాటి సమస్యకుమోక్షం లభించింది.
మండలంలోని పరడ గ్రామ శివారులోని పెద్ద వాగుపై వంతెన లేకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వర్షాకాలంలో వాగు దాటి షాపల్లి, నక్కలపల్లి, నారెగూడెం వెళ్లాలంటే ప్రజలు వాహనదారులు నానా అవస్థలు పడేవారు. గ్రామ రైతులు వాగు దాటి వ్యవసాయ బావుల వద్ద వెళ్లలేకపోయేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాగుపై వంతెన నిర్మాణం కోసం రూ.2.20కోట్ల నిధులు వెచ్చించింది. వంతెన నిర్మాణ పనులను త్వరగా న పూర్తి కావడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. వంతెనను నిర్మించి శాశ్వత సమస్యకు పరిష్కారం చూపించిన రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కష్టాలు తీరినయి..
గ్రామ శివారులోని పెద్ద వాగుపై వంతెన లేకపోవంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. వర్షాకాలం రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకొని వాగులో నుంచి వరద నీటిని దాటి వెళ్లాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయించి వంతెన నిర్మాణం చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి గ్రామస్తులు రైతులు రుణపడి ఉంటాం.