నీలగిరి, ఏప్రిల్ 16 : గుండెపోటు.. క్షణాల్లో ప్రాణాలను అరించేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనుషులను కబలించేస్తోంది. ఇందుకు మారుతున్న జీవనశైలి ప్రధాన కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరిస్తున్నారు.మంచి ఆహార అలవాట్లు తగినంత వ్యాయామంతో మృత్యువాత నుంచి బయట పడొచ్చని వివరిస్తున్నారు. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడి చనిపోతున్న వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సీపీఆర్ (కార్డియో పల్మాలజీ రిససిటేషన్) విధానాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది ఆశ వరర్లు, ఏఎన్ఎం సిబ్బంది నిర్వహించిన సర్వేలో సుమారు 40 లక్షలకు పైగా వైద్య పరీక్షలు చేశారు.
వీరిలో నల్లగొండ జిల్లాలో 2,23,490 మంది రక్తపోటు 68,175 మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. బీపీ, షుగర్ రెండూ ఉన్నవారు సుమారు 50 వేల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వీరిలో కొంతమంది బీపీ, షుగర్ లేకుండా కేవలం గుండె సంబంధిత వ్యాధులతో సుమారు 1.68 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరంతా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ చికిత్స పోందుతూ వస్తున్నారు. మరికొంతమంది అవగాహన లేమితో చికిత్సకు దూరంగా ఉంటూ ఏటా వందల సంఖ్యలో గుండెపోటుకు గురవుతున్నారు. హార్ట్ ఎటాక్ కేసుల్లో 20 నుంచి 35 ఏళ్ల వారు కూడా ఉన్నారని చిన్న వయసులోనూ బైపాస్ సర్జరీలు అవుతున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు 2,800 మందికి పైగా గుండె సంబంధిత వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరినట్లు, మరికొందరు చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారుల నివేధికలు స్పష్టం చేస్తున్నాయి.
కుటుంబ బాధ్యతల కారణంగా ఒత్తిడికి గురై పలువురు హార్ట్ స్ట్రోక్ బారిన పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే పలు మానసిక సమస్యలతో కూడా గుండెపోటుకు గురవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటివే చివరకు గుండెనొప్పికి దారి తీస్తున్నాయని పేర్కొంటున్నారు.
గుండెపోటు నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్రస్ధాయిలో సిబ్బందికి మాన్కిన్ బొమ్మల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్కు గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయే ప్రమాదాలను నివారించేందుకు సీపీఆర్ను విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే గుండెపోటుకు గురైన వారి ప్రాణాలు నిలిపేందుకు అప్పటికప్పుడు చేసే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) విధానంపై క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తోంది.
జిల్లాలోని వైద్యారోగ్య శాఖ అధీనంగా పనిచేస్తున్న దాదాపు 2 వేల మంది సిబ్బందికి సీపీఆర్పై శిక్షణ ఇచారు. 1,464 మంది ఆశలు, 132 సూపర్వైజర్లు, 457 ఏఎన్ఎంలు, 72 మంది మెడికల్ ఆఫీసర్లు, 232 మంది కంటి వెలుగు సిబ్బంది, 110 మంది మినిస్ట్రీయల్ స్టాఫ్, 150 మంది పారా మెడికల్ సిబ్బంది, 60 మంది అర్బన్ మలేరియా సిబ్బందితో పాటు ప్రోగ్రాం ఆఫీసర్లు ఇతర సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. దీనివల్ల అత్యవసర సమయంలో వేలాది మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది.
సీపీఆర్పై శిక్షణ ఇచ్చేందుకు ప్రజల తాకిడి ఉండే విభాగాలైన మున్సిపల్, పోలీస్, డీఆర్డీఏ, ఐసీడీఎస్, ఆర్టీఓ, స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా భాగస్వామ్యం చేశారు. వీరంతా పంచాయతీ, మున్సిపాలిటీలలో ఉండే వారికి శిక్షణ ఇస్తారు.
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది సిబ్బందికి సీపీఆర్పై శిక్షణ ఇచ్చాం. కార్డియాక్ అరెస్ట్తో మనుషులు కుప్ప కూలిపోతున్నారని అప్పటికప్పుడు సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. ఓ వైపు సీపీఆర్ చేస్తూనే ఇంకోవైపు అకడున్న వారి సాయంతో 108కు కాల్ చేయాలి. ఆ వాహనం వచ్చేలోపు సీపీఆర్ ద్వారా తిరిగి శ్వాస ప్రారంభమైతే ఆస్పత్రి తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది.
– డాక్టర్ అన్నిమల్ల కొండల్రావు, డీఎంహెచ్ఓ, నల్లగొండ
ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. ఒకప్పుడు 60 నుంచి 70 ఏళ్ల వయసులో కనిపించే గుండె జబ్బులు ప్రస్తుతం 20 నుంచి 35 సంవత్సరాల వయసు వారికి వస్తున్నాయి. వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిళ్ల కారణంగా చాలామంది తాతాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల కూడా చికులను కొని తెచ్చుకుంటున్నారు. గుండెపోటును రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహార అలవాట్లతో పాటు ఒత్తిడికి దూరంగా ఉంటూ తగిన వ్యాయామం చేయాలి.
– డా.పవన్ తేజ, ప్రముఖ గుండె వైద్య నిపుణులు, నిమ్స్ ఆస్పత్రి, నల్లగొండ