యాదాద్రి భువనగిరి, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నది. ఇప్పటికే పట్టణాలు, పల్లెల్లోనూ దవాఖానలకు పక్కాభవనాలు, ఆధునిక పరికరాలు సమకూర్చింది. మారూముల ప్రాంతాల్లో సైతం ఉత్తమ సేవలు అందించేందుకు హెల్త్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 137 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా సెంటర్లకు సొంత భవనాలు ఉండగా, మరికొన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వారి ఇబ్బందులు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు 57 ఉప కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనానికి రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ.11.40కోట్లు మంజూరు చేసింది. భవనాలను ఆయా గ్రామపంచాయతీల పర్యవేక్షణలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. మొదటి విడుత జిల్లా హెల్త్ సొసైటీలు ఒక్కో భవనానికి మొత్తం నిధుల్లో 50 శాతం అంటే రూ. 10 లక్షల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రెండో విడుతలో మిగిలిన 50 శాతం విడుదల చేయాలని సూచించింది.
57 కేంద్రాలకు భవనాలు
ఉమ్మడి జిల్లాలో 57 ఆరోగ్య ఉప కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 24, నల్లగొండలో 8, సూర్యాపేటలో 25 భవనాలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి, వంకిమామిడి, గుండ్లగూడెం, మాసాయిపేట, చొల్లేరు, మైలారం, రామలింగంపల్లి, కూరెళ్ల, వీరారెడ్డి పల్లి, వేలుపల్లి, చిన్నారావుల పల్లి, మదుంపల్లి, మసనపల్లి, కమ్మాయిపల్లి, గూడూరు, జమ్ములపేట, వెల్వర్తి, బొందుగుల, పారుపల్లి, అనాజ్పూర్, బస్వాపూర్, చందుపట్ల, రాయగిరి, నాంచారంపేట కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి.
తీరనున్న ఇబ్బందులు
కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇరుకు గదుల్లో నెట్టుకొస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల శిథిలావస్థలో ఉన్నాయి. దాంతో రోగులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయడంతో ఇబ్బందులు తొలగనున్నాయి.
ఉప కేంద్రాల్లో వివిధ సేవలు
ఆరోగ్య ఉప కేంద్రాల్లో వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. రోగులు, గర్భిణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పోషకాహార లోపం ఉన్న వాళ్లకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, కుష్టు, క్షయ రోగులకు వైద్యుల సూచనల మేరకు మందులు ఇస్తున్నారు. చిన్నారులకు టీకాలు వేస్తున్నారు. గ్రామాల్లో జనన, మరణాలను నమోదు చేస్తున్నారు.
కొత్త భవనాలు హర్షణీయం
గ్రామాల్లోని హెల్త్ సబ్ సెంటర్లకు కొత్త భవనాలు మంజూరు చేయడం హర్షణీయం. రాష్ట్రం వైద్యం రంగంలో ముందుకు దూసుకెళ్తున్నది. భువనగిరి మండలంలోని చందుపట్ల, బస్వాపూర్, అనాజిపూర్ సబ్ సెంటర్లకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు. ఇందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
-జనగాం పాండు, టీఆర్ఎస్ భువనగిరి మండలాధ్యక్షుడు