సామాన్యుల బాధలు గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మానవీయ పథకానికి రూపకల్పన చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల ఇండ్లల్లో క్రమంగా గ్యాస్ పొయ్యిలను ఆర్పే ప్రయత్నాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ విరుగుడు ఆలోచన చేస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే వంట గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తామని ప్రకటించారు. కేంద్రం పెంచే ధరలతో సంబంధం లేకుండా రూ.400కే సిలిండర్ అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11.13 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు ఉండగా ప్రతి నెలా 3.65లక్షల సిలిండర్లు రీఫిల్ అవుతున్నట్లు అంచనా. వారందరికీ ఒక్కో సిలిండర్పై ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం రూ.600భారం తగ్గనున్నది. పేదలు, ముఖ్యంగా మహిళలు కేసీఆర్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పథకాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే సాధ్యమంటూ ప్రశంసల
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : సామాన్యుల ముఖ్యమంత్రిగా బీదబిక్కి కష్టాలు గుర్తెరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో మానవీయ పథకానికి రూపకల్పన చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల ఇండ్లల్లో క్రమంగా గ్యాస్ పొయ్యిలను ఆర్పే ప్రయత్నాలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే వంట గ్యాస్ సిలిండర్పై భారీ రాయితీ ఇస్తామని ప్రకటించారు. కేంద్రం పెంచే ధరలతో సంబంధం లేకుండా రూ.400కే సిలిండర్ అందజేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11.13 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ప్రతి నెలా 3.65లక్షల సిలిండర్లు రీఫిల్ అవుతున్నట్లు అంచనా. ఒక్కో సిలిండర్పై ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం చూస్తే.. రూ.600 వరకు భారం తగ్గనున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోయింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, మన దగ్గర మాత్రం తగ్గించలేదు. దీంతో అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా సామాన్యులు గ్యాస్ సిలిండర్ కొనలేని పరిస్థితి. ఒకప్పుడు కట్టెల పొయ్యి పొగలతో అనారోగ్యంపాలైన గృహిణులు గ్యాస్ రాకతో ఆ బాధ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు సిలిండర్ ధర పెంపుతో మళ్లీ కట్టెల పొయ్యి పెట్టాల్సి వస్తుందేమోనని పేద మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మానవీయ కోణంలో ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.400కే గ్యాస్ బండ ఇస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8.50 లక్షల గ్యాస్ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. తద్వారా సగటున నెలకు వినియోగదారులకు రూ.22 కోట్లకు పైగా భారం తగ్గనున్నది.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏకంగా 15 సార్లు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు ఉన్నది. ఇప్పుడు రెండు రెట్లు దాటిపోయింది. గురువారం గ్యాస్ ధర రూ.1010 ఉంది. కేంద్రం ఓ వైపు గ్యాస్ ధరలు పెంచుతూనే.. మరో వైపు గ్యాస్ సబ్సిడీకి మంగళం పాడే ప్రయత్నం చేస్తున్నది. 2014కు ముందు గ్యాస్ సబ్సిడీ విధానం లేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్యాస్పై అధికంగా వసూలు చేస్తూ.. అందులోంచి సబ్సిడీ పేరుతో తిరిగి ఇచ్చే చెత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కానీ.. అది కూడా సక్కగా అమలు కావడంలేదు. రాను రాను సబ్సిడీని తగ్గిస్తూ పోతున్నది. ఇప్పుడు ఒక్కో సిలిండర్పై అతి తక్కువగా 40 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నది.
ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టింది. పేదల సంక్షేమమే లక్ష్యంగా వినూత్న పథకాలతో దేశానికే రోల్మోడల్గా నిలిచింది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్య మహిళ, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇలా ఎన్నెన్నో పథకాలను తొమ్మిదిన్నరేండ్లలో అమలు చేసి చూపింది. దీంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పారిశ్రామిక ప్రోత్సాహకాలతో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా మూడు రెట్లు పెరిగింది. వీటన్నింటి నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తే మరిన్ని మానవీయ పథకాల అమలుకు బీఆర్ఎస్ సన్నద్ధం అవుతున్నది. అందులో కీలకమైన పథకాల్లో రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ ఒకటి. దీని ద్వారా పేదలపై ఆర్థిక భారం తగ్గించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకే కేంద్ర ప్రభుత్వ ధరతో సంబంధం లేకుండా వంట గ్యాస్ సిలిండర్ను 400 రూపాయలకే ఇస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధరను పరిగణలోకి తీసుకుంటే ఉమ్మడి జిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై నెలకు సుమారు రూ.22కోట్ల భారం తగ్గనుంది. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు ఉన్నది. దీనిని రూ.400కు అందజేస్తే మిగిలిన భారాన్నంతటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 73 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా.. వాటి పరిధిలో సుమారు 8.50 లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు.
వీరికి సంబంధించిన సుమారు 11.13 లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్లగొండలో 4.97లక్షలు, సూర్యాపేటలో 4.05లక్షలు, యాదాద్రి భువనగిరిలో 2.10లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయి. 14.2 కిలోల ఒక్కో గ్యాస్ బండను రూ.400కే అందిస్తే రూ.600 భారం తప్పనుంది. ఉమ్మడి జిల్లాలో వినియోగంలో ఉన్న మొత్తం గ్యాస్ సిలిండర్లలో నెలకు సుమారు 3.65లక్షల సిలిండర్లు రీఫిల్కు వస్తున్నట్లు అంచనా. రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తే ప్రతి నెలా సుమారు రూ.22 కోట్ల భారం ప్రజలపై తగ్గనుంది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే బీపీఎల్ కుటుంబాలన్నింటికీ సన్న బియ్యం అందజేస్తామని ప్రకటించగా.. ఇక ముందు వంట గ్యాస్ భారం కూడా లేకుండా చేయాలనుకోవడం హర్షణీయమని సామాన్యులు ప్రశంసిస్తున్నారు.
400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తానని హామీ ఇవ్వడం బాగుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చాడంటే కచ్చితంగా అమలు చేస్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు వంట గ్యాస్ రేటు పెంచి నిరుపేదలపై చాలా భారం వేశారు. రూ.1250 వరకు పెంచి ఇటీవల 200 రూపాయలు తగ్గించామని చెబుతున్నారు. కానీ.. ఎన్నికల తరువాత మోదీ మళ్లీ రేటు పెంచడనే గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు ఉన్న వారిలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కచ్చితంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసింది. పేదల కష్టాలు గుర్తించిన సీఎం కేసీఆర్ దాదాపుగా సగానికంటే ఎక్కువ సబ్సిడీ ఇచ్చి పేదల మీద భారం పడకుండా చేస్తానని చెప్పడం చాలా సంతోషం.
– సీహెచ్ లక్ష్మి, గృహిణి (చౌటుప్పల్ రూరల్)
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టినందుకు గృహిణిగా చాలా సంతోషపడ్డాను. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర మా లాంటి పేద, మధ్య తరగతి కుటుంబాలకు మోయలేని భారం అవుతుంది. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో సిలిండర్కు సబ్సిడీ ఇచ్చినట్టే ఇచ్చి మధ్యలో చేతులేత్తేసింది. వారికి పేదల గోస తెల్వదు. పేదల పట్ల చిత్తశుద్ధి లేదు. మా లాంటి పేదలకు ఏది అవసరమో తెలిసిన వ్యక్తి మన కేసీఆర్. పెరిగిన గ్యాస్ ధరలతో పేదలు మళ్లీ కట్టెల పొయ్యి మీద ఆధారపడే రోజులు దాపురిస్తున్న తరుణంలో 400రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పడంతో ఎంతో సంతోషిస్తున్నాం. ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అందుకే కేసీఆర్ సారు మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా.
– కోల ధనలక్ష్మి, రాంనగర్, మిర్యాలగూడ
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అంటే రాష్ట్ర ప్రజలకు ఓ నమ్మకం. ఆయన మాట ఇస్తే తప్పే వ్యక్తి కాదు. పెరిగిన వంట గ్యాస్ ధరలతో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెలా రూ.955 పెట్టి గ్యాస్ కొనాలంటే భారంగా ఉంది. పేద మహిళల వంటింటి కష్టాలు అర్థం చేసుకొని రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం సంతోషకరం. దీంతో లక్షలాది కుటుంబాలకు మేలు జరుగనునంది. గత ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా అనేక పథకాలు తీసుకొచ్చి అమలు చేసిండ్రు. దీంతో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం కుదిరింది. ఒక వర్గం అని కాకుండా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పాలన అందించి రెండు సార్లు అధికారంలోకి వచ్చి రుజువు చేసుకున్నారు. మూడోసారి కూడా కేసీఆర్ సార్ సీఎం కావాలి.
– సింగం రజిత, గృహిణి, పులిపలుపుల, మునుగోడు మండలం
సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు గ్యాస్ పొయ్యిపై వంట చేసిన. కేంద్ర సరారోళ్లు వంట గ్యాస్ ధర పెంచుతుండడంతో సిలిండర్ వాడకుండా మూలకేసిన. రూ.1100 అయ్యే సరికి కట్టెల పొయ్యిపైనే వంట జేస్తున్న. పొగ రాంగ, కండ్లు మండంగ, ఇల్లంత పొగచూరంగ వంట జేస్తున్న. ఇగ సుట్టాలొస్తే మా గోస చెప్పరాకుండా ఉంది. సీఎం కేసీఆర్ సారు మా బాధలు చూసి రూ.400కే గ్యాస్ బండ ఇస్తనంటున్నడు. మల్ల మూలకేసిన గ్యాస్ పొయ్యిని బయటకు తీసి వంట జేసుకుంటా.
– ఆరె బాలమ్మ, ఆలేరు
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి పేదలకు అందుబాటులో లేకుండా చేసింది. సిలిండర్ ధర రూ.1100కు చేరింది. దీంతో పేదలు గ్యాస్ మీద వండుకోలేని పరిస్థితి దాపురించింది. రాష్ట్రంలో 3వ సారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇవ్వాలని మ్యానిఫెస్టోలో పెట్టడం హర్షణీయం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన నిలుస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరో మారు కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం.
– దూడల స్రవంతి, కొలనుపాక (ఆలేరు రూరల్)
ప్రతి ఇంట్లో నిత్యం అవసరంగా మారిన వంట గ్యాస్ ధరలను బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచడంతో పేదరికంలో ఉన్న మాలాంటి కుటుంబాలకు ఎంతో భారంగా మారింది. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ సార్ వంట గ్యాస్ ధరలను నాలుగు వందలకు తగ్గించనున్నట్లు ప్రకటించడంతో ఎంతో సంతోషం కలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో వంట గ్యాస్ వినియోగం తప్పనిసరి అయ్యింది. ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తామని చెప్పడం మాలాంటి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చింది.
– గడిపె రజిత, గృహిణి, వీరారెడ్డిపల్లి, తుర్కపల్లి మండలం