మిర్యాలగూడ, నవంబర్ 26 : నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించడం ద్వారా ధాన్యం దిగుబడిలో నంబర్వన్గా ఎదిగినం.. సీఎం కేసీఆర్ కృషితో దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరినం.. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరో మారు రైతు ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ మండలం హట్యాతండా, చింతపల్లి, కేశ్యాతండా, ఎఫ్సీఐతండా, వాల్యతండా, బోట్యానాయక్తండా, బాలుతండా, మహేశ్వరపురం, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్, కేశవానగర్ గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రగతి యాత్ర సాగింది. ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో ఎమ్మెల్యే భాస్కర్రావు స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలివచ్చి ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. మహిళా కోలాట బృందం, కళాకారులు ఆటపాటలతో అలరించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత మారుమూల పల్లెలు, తండాలు పచ్చటి పైర్లతో కళకళలాడుతున్నాయన్నారు. అంతర్గత సీసీ రోడ్లు, ప్రధాన బీటీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణంతో పరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు. బ్రిడ్జీల నిర్మాణం, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు.
మనది రైతు ప్రభుత్వమని అందుకే రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ అందించి వారిని అన్ని రకాలుగా ఆదుకున్నట్లు చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాగానే దశలవారీగా రైతుబంధు పెంచి రూ.16వేల వరకు పెంచి ఇవ్వనున్నట్లు తెలిపారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అదేవిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, సీఎం సహాయనిధి, కంటి వెలుగు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదలకు చేయూతనిచ్చినట్లు చెప్పారు. మండలంలోని హట్యాతండా గ్రామపంచాయతీ పరిధిలో రూ.5.17కోట్లతో, చింతపల్లి గ్రామంలో రూ.37.84 కోట్లతో, వెంకటాద్రిపాలెంలో రూ.41.80 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టినట్లు చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధిని కొనసాగడానికి కారు గుర్తుకు ఓటు వేసి మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబునాయక్, సీనియర్ నాయకుడు జొన్నలగడ్డ రంగారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదులుయాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు, పార్టీ ప్రధాన కార్యదరిశ పీసీకే. ప్రసాద్, సర్పంచులు ధీరావత్ లచ్చిరాం, బారెడ్డి అశోక్రెడ్డి, బాణావత్ లలితాసక్రం, మద్దెల శ్రీలత, ఎంపీటీసీలు ఆకుమర్తి గణేశ్, ధీరావత్ లక్ష్మి, తులసీరాం, నాయకులు మంచ్యానాయక్, విక్టర్, గాంధీనాయక్, శ్రీను పాల్గొన్నారు.