నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన చందంపేట మండలంలోని గుంటిపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తుండడంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి పదాన నడుస్తుంది. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం, క్రీడా ప్రాంగణం, ట్రాక్టర్లతో పారిశుధ్య నిర్వహణ, అలాగే మన బడి-మన ఊరు కింద పాఠశాలల్లో వసతుల కల్పన, డ్రైనేజీ, నీటి ట్యాంక్, మిషన్ భగీరథ నీరు, వీధి వీధిన సీసీ రోడ్డుతో గ్రామం కొత్తగా దర్శనమిస్తుంది. గుంటిపల్లి గ్రామంలో 560 మంది ఓటర్లు ఉన్నారు. – చందంపేట, మే 14
గుంటిపల్లి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటయ్యాక గ్రామంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. సర్పంచ్ చొరవతో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సహకారంతో అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామంలో రూ.55 లక్షలతో మన ఊరు-మన బడి పనులు, రూ.20 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.20 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో రోడ్లు, రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, రూ.24 లక్షలతో ఓహెచ్ఆర్ ట్యాంక్, రూ.10 లక్షలతో వ్యవసాయ పొలాలకు దారి, గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం ఇలా ఇతర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉండగా గుంటిపల్లి సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా గుంటిపల్లిని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశాక అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మారాయి. గతంతో పోల్చితే మా ఊరు చాలా మెరుగైంది. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న సీఎం సార్కు కృతజ్ఞతలు.
– గోన నర్సింహారావు, గుంటిపల్లి
నూతన గ్రామ పంచాయతీ అయిన గుంటిపల్లిని సర్పంచ్గా అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. గతంతో పోల్చితే గ్రామంలో ఎన్నో వసతులు సమకూరాయి. రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రస్తుతం రూ.కోటి విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సార్ నిధులు మంజూరు చేయడంతోనే అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుంది. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సహకారంతో గుంటిపల్లి అభివృద్ధిలో ముందుకు సాగుతుంది.
-మాధవరం శంకర్రావు, సర్పంచ్