ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని .. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం కావాలనుకున్నామో అవన్నీ సాకారమవుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తొమ్మిదేండ్లుగా రాజకీయాలకతీతంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అభివృధ్ధిపై చర్చ పెట్టాలని.. 2014కు ముందు, తర్వాత వచ్చిన మార్పులపై ప్రజలంతా మాట్లాడుకోవాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 431 మందికి రూ.4.31 కోట్ల కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. గతంలో రౌడీయిజం, సిండికేట్ దందాలతో సూర్యాపేటను ఆగం చేస్తే ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో పాలన అందిస్తున్నామన్నారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలకు పాల్పడినా తిప్పికొడుతూ అభివృద్ధిలో ముందుకు పోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నదని, ఇతర రాష్ర్టాల్లో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వల్లే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు పదవులు దక్కాయని, టీపీసీసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులు సీఎం కేసీఆర్ పెట్టిన భిక్షే అని ఆ పార్టీ నేతలు మరిచిపోవద్దని హితవు పలికారు.
– సూర్యాపేట టౌన్, మే 11
సూర్యాపేట టౌన్, మే 11 : తెలంగాణ వస్తే ఎదైతే సాకారమవుతుందని కలలు కన్నామో.. ఆ కలలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో వేలాది కోట్ల రూపాయలతో అన్ని నియోజికవర్గాల రూపురేఖలు మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తొమ్మిదేండ్లుగా రాజకీయాలకతీతంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిపై చర్చ పెట్టాలని, 2014కు ముందు, తర్వాత అభివృద్ధి, ప్రశాంత పాలనలో జరిగిన మార్పులపై ప్రజలంతా మాట్లాడుకోవాలని పేర్కొన్నారు. నేడు జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు విపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుకుంటున్నామన్నారు. గతంలో రౌడీయిజం, సిండికేట్ దందాలతో సూర్యాపేటను ఆగం చేస్తే తొమ్మిదేండ్లుగా ప్రశాంత వాతావరణంలో నిరంతర అభివృద్ధి పాలన కొనసాగిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత మిర్చి యార్డులో నియోజకవర్గ వ్యాప్తంగా 431 మందికి రూ.4.31 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం నేర్పింది పంచాయితీలు కాదని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ అభివృద్ధి పాలన అందించడం నేర్పించారన్నారు. అందుకే నేడు ఆయన నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటుందని, ఎక్కడికి వెళ్లినా ఆయా రాష్ర్టాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోని వారు విమర్శిస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటుతోనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు పదవులు దక్కాయని, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తోపాటు ఇతర రాష్ట్ర స్థాయి పదవులు అనుభవిస్తున్నారంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షే అన్నది మర్చిపోవద్దన్నారు. యావత్ భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అన్నిరంగాల అభివృద్ధితోపాటు వినూత్న పథకాలతో ఆడపడుచుల ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్టంలో 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిసున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే అన్నారు.
రాష్ట్రంలో ఆకలిని పారదోలి అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రధానంగా కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీతో ఆడపిల్లల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.6,348 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, అందులో ఇప్పటి వరకు 9,968 మందికి రూ.80 కోట్లతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసినట్లు చెప్పారు. వేల కోట్లతో జరిగిన అభివృద్ధిని ఆస్వాదిస్తున్న ప్రజలు, లబ్ధిదారులే స్వయంగా వివరిస్తూ.. నాటికి, నేటికి జరిగిన అభివృద్ధిలో మార్పులను వివరిస్తుంటే ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పట్టణ, మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇప్పుడు గొడవలు, కొట్లాటలు లేవు
ఇంతకు ముందు ఎలక్షన్లప్పుడే కాదు.. పండుగలు, పబ్బాలు జరిగినా గొడవలు, కొట్లాటలు ఎక్కువగా ఉండేవి. సాయంత్రం అయితే ఇంటోళ్లను బయటకు పంపాలంటే భయం వేసేది. ఒక వేళ ఫంక్షన్లకు పోయినోళ్లు ఇళ్లు చేరే వరకూ ఎదురుచూసెటోళ్లం. సంబంధం లేని గొడవలతో కేసులు అయితయేమోనని భయపడెటోళ్లం. కానీ, ఇప్పుడు ఎంత రాత్రయినా భయపడకుండా ప్రశాంతంగా బతుకుతున్నం. మా ఊళ్లో అందరూ ఏదో ఒక పని చేసుకుంటున్నరు. పండుగలు, పబ్బాలను ఆనందంగా గడుపుతున్నరు. తెలంగాణ వచ్చినంకనే ఊర్లన్నీ బాగుపడ్డయి సారూ.
-శ్రావణి, చీదెళ్ల
గుంతల రోడ్లు బాగుపడ్డయ్
ఇంతకు ముందు మా ఊరి నుంచి సూర్యాపేటకు రావాలంటే చాలా టైం పట్టేది. గర్భిణులు ఆటోల రావాలంటే చిన్నగా వెళ్లమని ఆటో డ్రైవర్లను బతిమాలుకునెటోళ్లం. అట్లాంటిది ఇప్పుడు రోడ్లు మంచిగయినయి. ఎక్కడ చూసినా డాంబర్ రోడ్లు, ఊర్లళ్ల సిమెంట్ రోడ్లు వేసిండ్రు. మురికి కాల్వలు శుభ్రంగా ఉంటున్నాయి. అట్లనే గతంలో చీకటైతె గుంతల రోడ్లు కనపడక ఎంతోమంది కిందపడి దెబ్బలు తగిలినయి. ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేదు సారూ.
– విజయ, న్యూబంజారాహిల్స్ తండా
కరంటు కూడా పోతలేదు
ఇదివరకు కరంట్ సక్కగ లేక పగటిపూట ఇంట్ల ఉండాలంటే ఉడకపోసి చెట్ల కిందకు పోయేటోళ్లం. సాయంత్రం దాకా ముసలోల్లను, చిన్న పిల్లల్ని చెట్లకిందనే ఉంచి తువాలలు, అట్ట ముక్కలతోని ఊపుకుంట కూసునేది. ఇంక పొలం కాడ కరంటు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెలియక మా ఇంటోళ్లు ఇంటికి, పొలం కాడికి తిరుగుతుండేది. కానీ, కేసీఆర్ సార్ వచ్చిన కానుంచి కరంటు పోకుండా 24 గంటలు ఉంటుంది. పొలం కాడ మోటర్ల తిప్పలు కూడా తప్పినయి సారూ.
-వెంకటమ్మ, రత్నాపురం