నల్లగొండ, మార్చి 7 : ఈ ఏడాది లోటు వర్షపాతం, ప్రాజెక్టుల్లో కరువైన నీటి లభ్యత కారణంగా జిల్లాలో భూగర్బ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గత నెలలో 8.68 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం.. ఈ నెలలో 10.06 మీటర్లకు పడిపోయింది. గత ఏడాది ఫిబ్రవరిలో 6.6 మీటర్లలో లోతులో ఉన్న గంగమ్మ ఈ ఏడాది ఇదే సమయంలో 3.93 మీటర్ల లోతులోకి పడిపోవడం ప్రమాద హెచ్చరికలను చేస్తున్నది. ఈ ఏడాది జిల్లాలో 19 శాతం లోటు వర్షపాతం కురవటం మూలంగా భూగర్భ జలాల సగటు 10.06 మీటర్లుగా నమోదుతున్నది.
చందంపేట మండలంలో 16.67 మీటర్లు, చిట్యాలలో 16.42 మీటర్ల లోతుకు నీళ్లు వెళ్లాయి. నాంపల్లి, నేరేడుగొమ్ము, పెద్దవూర, చండూరు, కేతేపల్లి మండలాల్లో 15 మీటర్ల సమీపంలో ఉన్నాయి. మిగిలిన మండలాల్లోనూ పది మీటర్ల దగ్గర కూడా ఎక్కడా కనిపిస్తున్న పరిస్థితి లేదు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో భూగర్భ జలాల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఈ సారి ఆ పరిస్థితి ఈ డిసెంబర్లోనే మొదలైంది. డిసెంబర్లో 7.64మీటర్ల లోతులో భూగర్బ జాలాలు ఉండగా, జనవరిలో 8.68మీటర్ల లోతుకు వెళ్లాయి. ఈ నెల 10 మీటర్ల దిగువకు చేరాయి. గత ఏడాది మే నెలలో 7.84మీటర్ల లోతులో ఉన్న భూగర్బ జలం ఫిబ్రవరిలోనే 10మీటర్ల దిగువకు పోతే.. మే నాటికి పరిస్థితి ఏంటన్నది ఆందోళనకరంగా మారింది.
ఇప్పటికే జిల్లాలో ఈ యాసంగి సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు అరిగోస తీస్తున్నారు. రానున్న రోజుల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. బావులు ఇంకిపోతుండడం, బోర్లు వట్టిపోతుండడంతో మానవాళితోపాటు పశుపక్షాదులకు కూడా ఈ వేసవి గడ్డుకాలం కానున్నది. పదేండ్ల తర్వాత మళ్లీ అధికార యంత్రాంగం అద్దె బోర్ల దిశగా ఆలోచన చేస్తూ తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.