– నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్
నీలగిరి, మే 02 : జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటేనే విజయాన్ని సాధించగలరని తెలిపారు. సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు.

‘జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే వీటికి దూరంగా ఉండాలి’
అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం అలాగే సమాజానికి తీవ్ర హానిని కలిగిస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు స్నేహితుల ప్రభావం, ఆసక్తి లేదా ఒత్తిడి కారణంగా డ్రగ్స్ వైపు మళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, గుండె, కాలేయం వంటి ముఖ్య అవయవాలు దెబ్బతింటాయని, మానసికంగా ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. అలాగే చదువుపై ఏకాగ్రత కోల్పోవడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు.

‘జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే వీటికి దూరంగా ఉండాలి’
ఎవరైనా డ్రగ్స్ ఆఫర్ చేసినప్పుడు స్పష్టంగా “కాదు” అని చెప్పాలని, చెడు స్నేహితులను దూరంగా ఉంచుకోవాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే 100 లేదా 1908 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ వినియోగం చట్టపరంగా నేరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.