మిర్యాలగూడ రూరల్, మే 16 : వేసవి సెలవుల్లో అమ్ముమ్మ ఇంటికి వచ్చిన పిల్లలు, పొలం వద్దకు వెళుతుండగా సరదాగా తాత వెంట వెళ్లారు. తాత పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో మూడు సంవత్సరాల మనుమడు హిమాన్షు బోరుబాయి పక్కన ఉన్న 12 అడుగుల గోతిలో పడిపోయాడు. మనవడిని కాపాడబోయిన తాత కంటు పెద వెంకన్న (55) అదే గోతిలో పడి మృతి చెందాడు. ఈ సంఘట మండలం పరిధిలోని యాద్గార్పల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో శనివారం జరిగింది. రూరల్ ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంటు పెద్ద వెంకన్న కూతురి పిల్లలు హిమాన్షు, లోహిత వేసవి సెలవులు కావడంతో పది రోజుల క్రితం అమ్ముమ్మ ఇంటికి వచ్చారు.
తాత ఉదయాన్నే లేచి బోరుబావి వద్దకు వెళుతుండగా ఆయన వెంట పిల్లలు ఇద్దరూ వెళ్లారు. తాత పొలం పనిలో ఉన్న సమయంలో మూడు సంవత్సరాల హిమాన్షు ఆడుకుంటూ బోరుబావి పక్కనే ఉన్న 12 అడుగుల గుంతలో పడిపోయాడు. ఇది గమనించిన తాత పరుగెత్తుకొంటూ వచ్చి మనవడిని కాపాడే క్రమంలో అదే గోతిలో తలకిందులుగా పడిపోయాడు. బయటకి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తాతను చూసి అక్కడే ఉన్న మనవరాలు సమీపంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి విషయం చెప్పింది. వారు వచ్చి కాపాడే యత్నం చేస్తూనే తనకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు.. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సైదులు అనే యువకుడి కాళ్లకు తాడు కట్టి తలకిందులుగా గోతిలోకి దించి వెంకన్నను, బాలుడిని బయటకు తీసినట్లు తెలిపారు. అప్పటికీ ఇద్దరూ సురక్షితంగానే ఉన్నారని, వైద్య పరీక్షల నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వం దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా తాత వెంకన్న మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. బాలుడు హిమాన్షు సురక్షితంగా ఉన్నాడని, మృతుని భార్య నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.