ముస్తాబైన లింగమంతుల ఆలయం ఐదు రోజులపాటు తిరునాళ్లు సకల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం గుట్టపైకి తరలిన మకర తోరణం పెద్దగట్టుపై కోలాహలం షురూ..రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరకు పెద్దగట్టు సిద్ధమైంది. ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టె రావడంతో దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర ప్రారంభం కానున్నది. ఐదు రోజుల తిరునాళ్లకు రాష్ట్ర నలుమూలలతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానుండగా, ప్రభుత్వం అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పోలీసులు ఇప్పటికే విధుల్లో చేరారు. జాతరకు ఒక రోజు ముందు నుంచే పెద్దగట్టు కోలాహలం నెలకొంది. అధికారుల హడావుడి, దుకాణాలు,ఎగ్జిబిషన్ ఏర్పాట్లతో సందడి నెలకొంది. శనివారం ఉదయం సంప్రదాయ పద్ధ్దతిలో గొల్లగట్టు పూజారులు, యాదవ పెద్దల సమక్షంలో పట్టణంలోని గొల్లబజారు నుంచి మకరతోరణాన్ని గుట్టపైకి తరలించారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భేరీ మోగించి జాతరను ప్రారంభించారు.
రాష్ట్రం లో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన దురాజ్పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) తిరునాళ్లు ఆదివారం అర్ధరాత్రి ప్రారంభం కానుంది. జాతర ప్రారంభానికి ఒక రోజు ముందు శనివారం నుంచే ఇక్కడ అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, భక్తుల కోలాహలం ప్రారంభమైంది. రెండేండ్లుగా నిర్జీవంగా ఉన్న ఈ ప్రాంతం ఐదు రోజులపాటు జనంతో కిక్కిరిసిపోనుంది. దాదాపు 15ఏండ్ల క్రితం వరకు అత్యధికంగా భక్తులు ఎడ్లబండ్లపై వచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లు, జీపులు, లారీలతో పాటు ప్రైవేట్ బస్సుల ద్వారా తండోపతండాలుగా వస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ పెట్టెను తీసుకొచ్చి గుట్టపై ఉన్న లింగమంతులస్వామి, చౌడమ్మ ఆలయాల మధ్య ఉంచుతారు. అనంతరం మెంతబోయిన, మున్న, గోర్ల కుటుంబాలకు చెందిన వారు తీసుకొచ్చిన బియ్యంతో వండిన అన్నంతో బోనాలను తయారు చేసి దేవుళ్లకు సమర్పిస్తారు. గంపలతో ప్రదక్షిణలు చేయడం ద్వారా జాతర ప్రారంభమవుతుంది. శనివారం ఉదయం సాంప్రదాయ పద్ధతిలో గొల్లగట్టు పూజారులు, యాదవ పెద్దల సమక్షంలో పట్టణంలోని గొల్లబజారు నుంచి మకర తోరణాన్ని గుట్టపైకి తరలించగా మంత్రి జగదీశ్రెడ్డి భేరీ మోగించారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2015లో జరిగిన తొలి జాతర నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగట్టుకు కోట్లాది రూపాయలు విడుదల చేశారు. ఆ నిధులతో భక్తులకు శాశ్వత ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు కల్పించారు. గతంతో పోల్చితే నేడు వెయ్యి రెట్లు బాగుందని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుట్ట వద్దకు వెళ్లేందుకు ఉన్న రోడ్లను శుభ్రం చేయించడం, మంచినీటి కోసం గుట్టపై గతంలో నిర్మించిన 1.50లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకుకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే గుట్టపై ఉన్న కోనేరులోని పాత నీటిని తొలగించి ఫైరింజన్ సహాయంతో కొత్త నీటిని నింపారు. గుట్ట చుట్టూ మహిళల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లతో పాటు వస్ర్తాలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. ఈ సారి జాతరకు 30 నుంచి 35లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తుండగా.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఐదు రోజుల జాతర ఇలా..
ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర మొదటి రోజైన ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి యాదవ భక్తులు బోనాలు, గంపలతో ప్రదక్షిణలు చేస్తారు. రెండో రోజైన సోమవారం చౌడమ్మ తల్లికి బోనాల చెల్లింపు.. తెల్లవారుజామున జంతువుల బలి. మూడో రోజు మంగళవారం లింగమంతులస్వామి గుడి ముందు చంద్రపట్నం వేస్తారు. నాలుగో రోజు బుధవారం నెల వారం వేస్తారు. చివరి రోజైన ఐదో రోజు గురువారం దేవరపెట్టెకు పూజలు చేసి కేసారం తరలించడం ద్వారా జాతర ముగుస్తుంది.
ఒక రోజు ముందే కోలాహలం
ఆదివారం అర్ధరాత్రి జాతర ప్రారంభం కానుండగా.. ఒకరోజు ముందే శనివారం పెద్దగట్టు పరిసరాల్లో అధికారులు, సిబ్బంది, వ్యాపారుల కోలాహలం ప్రారంభమైంది. జాతర జరిగే గుట్టతో పాటు పరిసర ప్రాంతాలన్నీ వ్యాపారులతో సందడిగా మారాయి. భక్తులకు అసౌకర్యం కలుగకుండా, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించేందుకు వివిధ శాఖల అధికారులు గుట్టపైన, కింద తమ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. గుట్ట చుట్టూ వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకొని సరుకులను సర్దుకున్నారు. మొత్తం మీద జాతర ప్రారంభానికి ఒక రోజు ముందే కోలాహలం కనిపించింది.
చివ్వెంల, ఫిబ్రవరి 4 : సూర్యాపేట పట్టణానికి 6కిలోమీటర్ల దూరంలో చివ్వెంల మండలం దురాజ్పల్లి వద్ద 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనే పెద్దగట్టు గుట్టపై వెలిసిన లింగమంతుల స్వామి జాతర రెండేండ్లకోసారి జరుగుతుంది. యాదవుల ఆరాధ్య దైవంగా, యాదవ సంస్కృతికి అద్దం పట్టేలా కొనసాగుతున్న ఈ జాతర ఎప్పటి నుంచి జరుగుతుందో కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ సుమారు 350ఏండ్ల నుంచి చేస్తున్నారని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తున్నది. ఈ జాతర పుట్టుక గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. లింగమంతుల స్వామి అంటే పరమేశ్వరుడు గనుక అక్కడ జంతువులను బలి ఇవ్వరు. కానీ.. అక్కడే వెలిసిన చౌడమ్మ, యలమంచమ్మ దేవతలకు జంతు బలిని నైవేధ్యంగా సమర్పిస్తారు. లింగమంతులస్వామి, చౌడమ్మ దేవత భక్తులు కోరిన కోర్కెలను తీర్చుతున్నట్లు ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే ప్రతి జాతరకు లక్షలాది మంది వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆరు నెలల పసికందు నుంచి వృద్ధుల వరకు తల నీలాలు సమర్పించి మూడు కత్తెర వెంట్రుకలు, రూపాయి నాణెంతో జోడించి నాగదేవత పుట్టపై పెట్టి మొక్కుబడి చెల్లిస్తారు. సంతానం లేనివారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే మహిళలు దేవుడిని స్మరిస్తూ కొలనులో స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ పానసారం చేసి పొర్లు దండాలు పెడితే సంతానం కలుగుతుందని, రోగాలు నయమవుతాయని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ జాతరకు యాదవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి తమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకుంటారు.
భక్తులకు సకల సౌకర్యాలు
సూర్యాపేట, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాం. భక్తులు ప్రశాంతంగా మొక్కులు చెల్లించుకొని.. బస చేసే స్థలంలో కుటుంబంతో సంతోషంగా గడిపి ఇంటికి వెళ్లేలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతానికి భిన్నంగా వసతులు కల్పిస్తున్నాం. గుట్టపైన, కింద ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతరను మొత్తం జోన్లుగా విభజించి ప్రతి జోన్కు ఒక సీనియర్ అధికారిని నియమించాం. ఆయనతో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తమ జోన్లలో భక్తులకు సహకారం అందిస్తారు. జాతర ప్రాంగణంతో పాటు రెండు కిలోమీటర్ల మేర చెత్తాచెదారం ఉండకుండా శానిటేషన్ సిబ్బందిని నియమించాం. వైద్య ఆరోగ్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నాం. జంతు బలి కోసం ప్రత్యేకంగా కబేళా ఏర్పాటు చేశాం. గుట్టపై ఉన్న భారీ ట్యాంకుకు మిషన్ భగీరథ పైపులైన్తో లింక్ కలుపడంతో భక్తులకు నీటి సమస్య ఉండదు. భక్తుల దాహర్తి తీర్చేందుకు గుట్ట చుట్టూ ప్రత్యేక నల్లాలు ఏర్పాటు చేశాం. వంటలు, ఇతర వినియోగం కోసం పెద్ద ఎత్తున నీటి ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. జాతర సంతోషంగా ముగియడానికి అన్ని శాఖలు, రాజకీయ పార్టీలు, భక్తులు ప్రతిఒక్కరూ సహకరించాలి.
– జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్
పెద్దగట్టు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి తెలిపారు. పెద్దగట్టు వద్ద మున్సిపాల్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఐదు రోజుల పాటు పారిశుధ్య నిర్వహణకు షిఫ్ట్కు 188మంది చొప్పున మూడు షిఫ్టులకు 564మంది పారిశుధ్య కార్మికులను, మరుగుదొడ్ల పరిశుభ్రతకు స్కావెంజర్లను నియమించామన్నారు. గతంలో ఉన్న ఏడు శాశ్వత మరుగుదొడ్ల మరమ్మతుతోపాటు 30ప్రాంతాల్లో 64 తాత్కాలిక టాయ్లెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగునీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్ల పర్యవేక్షణ, నిర్వహణకు మున్సిపల్ సిబ్బంది కాకుండా అదనంగా 48మంది పంచాయతీ కార్యదర్శులు (సూపర్వైజింగ్ కోసం), 24మంది జోనల్ అధికారులుగా పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ ఏఈ, డీఈలను నియమించామని చెప్పారు. 16మంది మున్సిపల్ జవాన్లు, ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశీలన చేసేందుకు 3షిఫ్ట్ల వారీగా 45మంది సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు. సెప్టిక్ ట్యాంకులు నిండిన వెంటనే మలం తొలగించేందుకు 3గల్పర్ మిషన్లు అందుబాటులో ఉంచామన్నారు. గుట్ట చుట్టూ ఎల్ఈడీ లైటింగ్, నాలుగు జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుట్ట పైనుంచి వచ్చే జంతు రక్తం రోడ్డు మీదకు రాకుండా గుట్ట వెనుక కాల్వ నిర్మాణంతో పాటు జెట్టింగ్ మిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. గుట్ట చుట్టూ రోడ్డుపై దుమ్ము లేవకుండా నీటిని చల్లిస్తున్నామన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఈఈ జీకేడీ ప్రసాద్, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏఈలు ఉన్నారు.