పంచనారసింహుడికి నిత్యారాధనలు
స్వామి ఖజానాకు రూ.14,20,793 ఆదాయం
యాదాద్రి, జూలై 11 : యాదగిరికొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. రామలింగేశ్వరుడిని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి, పరమశివుడిని విభూతితో అలంకరించారు. ఉపాలయాల్లో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి, మహాగణపతి, ఆంజనేయ స్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకంతో అర్చించారు. శివాలయ ప్రధాన పురోహితుడు విశేష పుష్పాలంకరణ చేశారు. సాయంత్రం శివాలయ మాఢవీధుల్లో రామలింగేశ్వరుడిని అలంకార సేవలో ఊరేగించారు. సుమారు గంటపాటు సాగిన ఊరేగింపు సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. అన్ని విభాగాలు కలుపుకుని స్వామి వారి ఖజానాకు రూ.14,20,793 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.గీత తెలిపారు.
కాటేజీ నిర్మాణానికి రూ.5లక్షల విరాళం
యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన కాటేజీల నిర్మాణాలకు దాతల సహకారం లభిస్తున్నది. హైదరాబాద్కు చెందిన దాత గంగాధర్ రూ.5లక్షల విరాళాన్ని ఏఈఓ గజవెల్లి రమేశ్బాబుకు సోమవారం అందించారు.
స్వర్ణ తాపడానికి రూ.6.49లక్షల విరాళం
యాదగిరిగుట్ట ప్రధానాలయ విమానగోపురం స్వర్ణ తాపడానికి భక్తులు తమకు తోచిన విరాళం అందిస్తున్నారు. జూన్21నుంచి ఈ నెల 10వ తేదీ వరకు స్వర్ణతాపడానికి రూ.6,49,834 విరాళం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు. ఇందులో చెక్కులు, డీడీ రూపంలో రూ. 2,60,580, ఛలాన్, నగదు రూపంలో రూ.2,94,330, ఆర్టీజీఎఫ్, నెఫ్ట్, క్యూఆర్ కోడ్, ఆన్లైన్లతో రూ.93,133 నగదు సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు.
యాదాద్రీశుడి సేవలో మాజీ మంత్రి మోత్కుపల్లి
యాదాద్రీశుడిని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఆయన జన్మదినం సందర్భంగా ఉదయం యాదాద్రికి చేరుకున్న ఆయన వైకుంఠద్వారం వద్ద పూజలు చేశారు. శ్రీవారి మెట్ల గుండా పాదయాత్రగా కొండపైకి చేరుకున్నారు. అనంతరం ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకున్నారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొని స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక బృందం ఆయనకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు స్వామివారి ప్రసాదం అందించారు.