పంచనారసింహుడికి నిత్యారాధనలు
స్వామివారి ఖజానాకు రూ.27,94,847 ఆదాయం
యాదాద్రి, జూన్ 27 : యాదాద్రి కొండపైన వేంచేసి ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో పురోహితులు పరమశివుడికి వైభవంగా విశేష పూజలు జరిపారు. సోమవారం కావడంతో గర్భాలయంలోని స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నరపాటు నిర్వహించారు. రామలింగేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరించారు. ఉపాలయాల్లో సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చించారు. శివాలయం ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు.
తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి నిజాభిషేకం, తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేశారు. స్వామివారి సువర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. యాదాద్రి కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.27,94,847 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహుడిని ఇస్కాన్ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు.
శివాలయంలో మాస శివరాత్రి వేడుకలు..
యాదాద్రి అనుబంధ శివాలయంలో మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివుడికి 108 శంఖాలతో అష్టోత్తర శత శంఖాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధానార్చకుడు నరసింహరాములు శర్మ, ప్రధాన పురోహితుడు సత్యనారాయణ శర్మ పాల్గొన్నారు.
వచ్చే నెల 6న గుట్టలో జగన్నాథ రథయాత్ర
యాదాద్రి, జూన్ 27 : కూకట్పల్లికి చెందిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) అధ్యక్షుడు మహాష్రింగ్ దాస ఆధ్వర్యంలో జూలై 6న యాదగిరిగుట్ట పట్టణంలో జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ కూకట్పల్లి కో ఆర్డినేటర్ శ్రీవాణి తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల నుంచి ప్రారంభమై గుండ్లపల్లి వరకు రథయాత్ర కొనసాగుతుందన్నారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ యాత్రను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రారంభిస్తారని, ప్రతి ఒక్కరూ పాల్గొని రథాన్ని లాగాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు బిషో మహాన్ ప్రభు, ఒక్సానా మాతా, ఆనంద్ లీలాదేవి దాసి, కర్రె ప్రవీణ్ పాల్గొన్నారు.