నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేటి నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను జిల్లా అధికార యంత్రాంగాలు గుర్తించాయి. మంగళవారం జిల్లాలో పలు చోట్ల ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం యాసంగి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ సేకరణపై ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, డీఎంలు, ఎఫ్సీఐ అధికారులతో బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి టి.హరీశ్రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
వెంటనే కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించకొని కొనుగోళ్లకు సిద్ధం కావాలన్నారు. రైతుల పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలను ఈ సీజన్లోనూ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
నల్లగొండ జిల్లాలో 278 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు, ధాన్యం రాకను బట్టి ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి వెల్లడించారు. నేటి నుంచి జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. అధికారులు కూడా ఈ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ధాన్యం రాకకు అనుగుణంగా దశల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రైతులు సహకరించాలని కలెక్టర్ సూచించారు. నేడు నల్లగొండ శివారులోని అర్జలాబావి, చందనపల్లి, చిన్న సూరారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించనున్నారు. మరికొన్ని చోట్ల కూడా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.