బొడ్రాయిబజార్, డిసెంబర్ 2 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్క రోజు 31,112 బస్తాల ధాన్యం తీసుకురాగా క్వింటాకు రూ.2,453 ధర పలికింది. ఇటీవల ప్రారంభించిన పత్తి మార్కెట్కు 46 క్వింటాళ్ల పత్తిని రైతులు తీసుకురాగా క్వింటాకు రూ.8,633 ధర వచ్చినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండీ.ఫసి యొద్దీన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఎప్పటికప్పుడు మిల్లర్లు, ట్రేడర్స్తో మాట్లాడుతూ రైతులకు మంచి ధర అందేలా చూస్తున్నట్లు తెలిపారు. మద్దతుకు మించి ధర వస్తుండడంతోనే రైతులు సూర్యాపేట మార్కెట్కు ధాన్యం అధికంగా తీసుకొస్తున్నట్లు చెప్పారు. రైతులు దళారులు, లోడర్లను సంప్రదించి మోసపోకుండా మార్కెట్కు తీసుకువచ్చి అధిక లాభం పొందాలని కోరారు. సోమవారం నుంచి అర్థరాత్రి 12 గంటలు దాటిన తరువాతనే రైతుల ధాన్యాన్ని మార్కెట్లోకి అనుమతించనున్నట్లు రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా కోరారు.