బొడ్రాయిబజార్, ఏప్రిల్ 13 : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తుతుంది. మార్కెట్కు నిత్యం 50వేల నుంచి 60వేల బస్తాల వరకు రైతులు తీసుకొస్తున్నారు. అయితే.. ధర తక్కువ పడుతుండడం, కాంటాలు, ఎగుమతులకు ఆలస్యం అవుతుండడంతో రైతులకు ఇబ్బంది కాకుండాప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
రోజూ 30వేల నుంచి 35వేల బస్తాల వరకు ధాన్యాన్ని అనుమతించేందుకు మార్కెట్ అధికారులు కమీషన్దారులకు టోకెన్లు జారీ చేస్తున్నారు. ఆ టోకెన్ల మేరకు శనివారం వ్యవసాయ మార్కెట్కు 30,574 బస్తాల ధాన్యం వచ్చింది. అయితే.. ధాన్యం ఎక్కువగా వస్తుండడంతో కొద్ది మంది రైతులకు మాత్రమే మద్దతుకు మించి ధర అందిస్తున్నారు. మిగతా వారికి తాలు, చెత్త, తేమ పేరుతో తక్కువ ధర పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగురు రైతులు 106 బస్తాల పాత బీపీటీ ధాన్యం తీసుకురాగా క్వింటాకు రూ.2709 నుంచి రూ.2,389 వరకు ధర పలికింది. 389 మంది రైతులు 18,800 బస్తాల జైశ్రీరాం రకం ధాన్యం తీసుకురాగా రూ.2,556 నుంచి రూ.1501 ధర పలికింది. 151మంది రైతులు ఐఆర్ 64 రకం ధాన్యం తేగా రూ.1849 నుంచి రూ.1546వరకు, 100 మంది రైతులు హెచ్ఎంటీ ధాన్యం తీసుకురాగా, రూ.2,249 నుంచి రూ.1519 వరకు, ఆర్ఎన్ఆర్ తెచ్చిన ఇద్దరు రైతులకు రూ.1903 నుంచి రూ.1659 ధర పలికింది. ఈ ఏడాది అసలే కాలం కాక పండిన కొద్ది పంటకు కూడా సరైన ధర అందడంలేదని, దీంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.