రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల
గొర్రెల కాపరులతో మాటముచ్చట
భువనగిరి కలెక్టరేట్, జూలై 5 : గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపురంలో గొర్రెల కాపరులతో మాటముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలు, మేకల పెంపకందారుల ఆర్థిక బలోపేతానికి ఉచిత గొర్రెల పంపిణీ చేపట్టిందన్నారు. ప్రభుత్వం అందజేసిన సబ్సిడీ గొర్రెలతో గొల్లకుర్మల జీవన ప్రమాణాలు వృద్ధిచెందాయని పేర్కొన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి ఎన్డీసీసీ ద్వారా రూ.4,563కోట్ల రుణం మంజూరైందని, త్వరలోనే పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయంటున్న ప్రతిపక్షాలకు.. గొర్రెలు, మేకల పెంపకందారుల కండ్లల్లో కనిపించే ఆనందమే సమాధానమని పేర్కొన్నారు. పథకం లబ్ధిదారుడు వెంకన్న యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్లకుర్మల పాలిట దేవుడని అన్నారు. ఉచితంగా 21గొర్రెలను అందించి గొల్ల కుర్మలు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందారులు వెంకటేశ్యాదవ్, మల్లేశ్, కొమురయ్య పాల్గొన్నారు.