సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన చదువు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మన ఊరు..మన బడి కార్యక్రమంతో సకల వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. విద్యార్థుల్లో చదువడం, రాయడంతోపాటు గణిత చతుర్విద అంశాల్లో సామర్థ్యాలు సాధించేలా కృషి చేస్తున్నది. రెండు మూడు సంవత్సరాలుగా త్రీఆర్స్, మూలాల్లోకి వెళ్దాం వంటి కార్యక్రమాలు చేపట్టగా ఈ ఏడాది పఠనోత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రతి విద్యార్థి చదివేలా చూడాలి’ అనే నినాదంతో నేటి నుంచి జూలై 31వరకు క్యాంపెయిన్ నిర్వహించనున్నది. దీని కోసం విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ప్రతి రోజూ ఒక పీరియడ్ దీని కోసం కేటాయించనున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దీన్ని అమలు చేసి అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యం పెంచనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమమైన గుణాత్మక విద్యను అందించి వారి భవిష్యత్కు బాటలు వేసేలా చేయాలనేది ప్రభుత్వం, విద్యాశాఖ లక్ష్యం. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ తరగతుల్లోకి వచ్చిన విద్యార్థులకు సైతం చదువడం, రాయడం, గణితం అంశాల్లో వెనుకబడి ఉన్నారనేది నేషనల్ అచివ్మెంట్ సర్వే గతంలో వెల్లడించిన విషయం విదితమే. దీంతో విద్యాశాఖ వాటిని పెంచేందుకు 2017కు ముందు త్రీ ఆర్స్ (చదువడం, రాయడం, ఆర్థమెటిక్)ను అమలు చేయగా.. దాని స్థానంలో 2019-20 సంవత్సరానికి ‘మూలాల్లోకి వెళ్దాం’ అనే పేరుతో ఏబీసీ (అటైన్మెంట్ ఆఫ్ బేసిక్ కాంపిటెన్సీ) కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ స్థానంలో ఈ విద్యా సంవత్సరం ‘ప్రతి విద్యార్థి చదివేలా చూడాలి’ అనే అంశంతో పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్)కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి నుంచి జూలై 31వరకు కొనసాగించనున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
1నుంచి 10వ తరగతి వరకు అమలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాతృభాష, గణితం, ఆంగ్ల భాషల్లో కనీస సామర్థ్యాలను సాధించేలా పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్) అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు విరామ కాలం సద్వినియోగం చేసుకునేలా సృజానాత్మక ఆలోచనలకు, వ్యక్తీకరణ సామర్థ్యానికి బాటలు వేసేలా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. రెగ్యులర్ తరగతులకు ఆటంకం కలుగకుండా పాఠ్యాంశాలు బోధించి విద్యార్థులందరూ ధారాళంగా చదువగలిగేలా చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. విద్యార్థులందరూ స్వతంత్ర పాఠకులుగా ఎదుగడం, వారి స్థాయికి తగిన అంశాలను ధారాళంగా చదువగలిగేలా పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు, పాఠ్యేతర పుస్తకాలు, కథల పుస్తకాలు, వార్తా పత్రికలు ధారాళంగా చదివేలా చేయడమే దీని ప్రధానోద్దేశం. ఈ నెల 26నుంచి జూలై చివరి వరకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు విద్యార్థి వారీగా నివేదికలను నమోదు చేసి తెలియపరుచాల్సి ఉంటుంది.
3,113 పాఠశాలల్లో అమలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పఠనోత్సవం అమలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 1,485, సూర్యాపేటలో 909, యాదాద్రి భువనగిరి జిల్లాలో 719 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1నుంచి 10వ తరగతి చదువుతున్న 2.27లక్షల మంది విద్యార్థులకు నిత్యం పఠనోత్సవం అమలు చేస్తూ జూలై 31వరకు విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. రోజువారీ సబ్జెక్టుల బోధనలకు ఆటంకం కలుగకుండా ఉదయం లేదా పాయంత్రం ఏదో సమయంలో నేర్పించాలి. జిల్లా విధ్యాశాఖ అధికారి నేతృత్వంలో జిల్లా మానిటరింగ్ బృందాలు ఏర్పడి పర్యవేక్షిస్తాయి. సెక్టోరియల్ అధికారులు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారు.
పఠనోత్సవం నిర్వహణ ఇలా..
సామర్థ్యాల పెంపునకే పఠనోత్సవం
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతుల విద్యార్థులకు పఠనోత్సవం నిర్వహణకు సన్నద్ధం చేశాం. విద్యార్థులకు నిత్యం తరగతి బోధనాంశాలతోపాటు ప్రత్యేక పీరియడ్ కేటాయించి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు అంశాల్లో పఠనం (చదువడం) నిర్వహిస్తాం. వాటిల్లో నైపుణ్యాలు లేని వారిని గుర్తించి వారిలో సామర్థ్యాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి విద్యార్థులు కూడా ఇతర విద్యార్థులతో పోటీ పడేలా పఠన నైపుణ్యాలు పెంచి స్వతంత్రంగా చదివేలా చేయడమే ఉపాధ్యాయులు, విద్యాశాఖ లక్ష్యం. దీనికి సంబంధించిన ప్రణాళికలను అన్ని పాఠశాలలకు అందజేశాం. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసేలా కృషి చేస్తాం.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ
పటిష్టంగా నిర్వహించాలి
పఠనోత్సవం కార్యక్రమాన్ని ప్రణాళికాయుతంగా జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పటిష్టంగా నిర్వహించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. దీని ద్వారా తొలిమెట్టులో మనం ఆశించే ఫలితాలను మరింత తొందరగా చేరుకుంటాం. ఇందులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ ఫ్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారులందరూ నిత్యం పర్యవేక్షణ చేసి విజయవంతం చేయాలనేది డీఈఓ ఆదేశం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కార్పొరేట్, ప్రైవేట్కు దీటుగా రాణిస్తున్నారనే విధంగా తయారు చేయడంలో ఉపాధ్యాయుల ప్రాత కీలకమైంది. విద్యార్థులు ఎలా చదువుతున్నారో తెలియజేయడానికి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి వారి పిల్లల ప్రగతిని చూపించాలి.
– ఆర్.రామచంద్రయ్య, విద్యాశాఖ సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారి, నల్లగొండ