చెరువులు నిండడమే తరువాయి
వంద శాతం రాయితీతో ఇస్తున్న సర్కారు
సూర్యాపేట జిల్లాలో 850 చెరువులు
సూర్యాపేట జిల్లాలో ఉన్న చెరువులు – 850
మత్స్యకార సొసైటీలు – 144
మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు – 4
సంఘాల్లో ఉన్న సభ్యులు – 16500
కొత్త సంఘాల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులు – 18
నేరేడుచర్ల, జూలై 5 : మత్స్యకారుల అభివృద్ధి, సంఘాల బలోపేతం, మత్స్య సంపద పెంపునకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏటా ఉచితంగా చేప పిల్లలను వంద శాతం రాయితీతో అందిస్తున్నది. ఈ సారి కూడా సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం కింద సూర్యాపేట జిల్లాలోని 850 చెరువులు, కుంటల్లో 3కోట్ల 60లక్షల చేప పిల్లలు వదలాలని నిర్ణయించింది. ఇందుకోసం మత్స్యశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
30శాతం నీరు నిండితే..
జిల్లాలో మొత్తం 850 చెరువులు, కుంటలు ఉన్నాయి. వర్షాలు కురిసి చెరువుల్లోకి 30శాతం నీళ్లు వస్తే చేప పిల్లలు వదలనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా పూడికతీతతో చెరువులు, కుంటల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. తక్కువ శాతం నీరు ఉన్న చెరువులు, కుంటల్లో 35 మిల్లీమీటర్ల పొడవు నుంచి 40ఎం.ఎం. పొడవున్న చేప పిల్లలను వదలనున్నారు. సమృద్ధిగా నీరు ఉన్న పెద్ద చెరువుల్లో 80ఎం.ఎం. నుంచి వంద మిల్లీమీటర్ల పొడవుండే పిల్లలు వేయనున్నారు.
నాలుగు రకాల చేప పిల్లల పంపిణీ
చేపల పెంపకమే ప్రధాన వృత్తిగా జిల్లాలో వేలాది మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మత్స్యకార సంఘాలకు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేయనుంది. అయితే.. ఈసారి బొచ్చ, రవ్వ, బంగారుతీగ, మోసు వంటి రకాల 3.60కోట్ల పిల్లలను మత్స్యకారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారా చేప పిల్లలను కొనుగోలు చేయనున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. వంద శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం సంతోషంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వమూ మత్స్యకారుల గురించి ఆలోచించలేదు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు దొరకడం అదృష్టం.
– పేరబోయిన వీరయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు
వర్షాలు కురిసి చెరువుల్లో నీరు చేరిన వెంటనే చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చేప పిల్లల కొనుగోలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తాం. ఈ సారి జిల్లాలోని 850 చెరువులు, కుంటల్లో 3.60 కోట్ల పిల్లలను వదులుతాం.
– సౌజన్య, జిల్లా మత్స్యశాఖ అధికారి