రాష్ట్ర ఉన్నత విద్యమండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి
రామగిరి, జూన్ 4 : అందరికీ ఉన్నత విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మెనేజ్మెంట్ అసోసియేషన్, ఎంజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నల్లగొండలోని మనోరమ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన ‘ఉన్నత విద్యామండలి చైర్మన్ అండ్ వీసీ ఎంజీయూతో పరస్పర సమావేశం’ అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ఎంజీయూ వీసీ ప్రొ.గోపాల్రెడ్డితో కలిసి హాజరయ్యారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశంలో దోస్త్ అడ్మిషన్లు, నూతన కోర్సులు, ఫీజు రీయింబర్స్మెంట్, ఎంజీయూ పరిధిలో ఎదుర్కొంటున్న సమస్యలు-పరిషార్కాలు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా చర్చ జరిగింది. తొలుత నల్లగొండలోని నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ మారం నాగేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకొచ్చిన సీబీసీఎస్ కోర్సులను అమలు చేయడం లేదని, దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రాఘవేంద్ర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఆదిత్యసామ్రాట్ మాట్లాడుతూ.. దోస్త్ అడ్మిషన్లు, సర్వర్ సమస్యలు, మౌలిక వసతులు లేకుండా ప్రభుత్వ కళాశాలలకు అడ్మిషన్ల పెంపు, ప్రైవేట్ కళాశాలలకు కలిగిన నష్టాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
కోదాడలోని ఎస్వీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సైదేశ్వర్రావు మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా కళాశాలను నిర్వహిస్తున్నామని, దోస్త్తో సమస్యలు ఎదుర్కొంటున్నామని, వాటిని పరిష్కరించాలని, సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని కోరారు. భువనగిరి జాగృతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్, ఎంజీయూ పాలక మండలి సభ్యుడు సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎంజీయూ పరిధిలో సమస్యలపై మాట్లాడారు. ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అసోసియేషన్ ఎంజీయూ అధ్యక్షుడు భాస్కర్రావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీఎస్ ప్రకాశ్, పలువురు కరస్పాండెంట్లు సమస్యలను వివరించారు.
గుణాత్మక విద్య అందించేందుకే..
ఎంజీయూ వీసీ ప్రొ.గోపాల్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ఆదేశాలను అన్ని కళాశాలలు విధిగా పాటించాల్సిందేన్నారు. విద్యార్ధి కేంద్రీకృతంగా నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలనే సంకల్పంతో అందరి సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి మాట్లాడుతూ.. ఉన్నత విద్యామండలి సేవలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా అమలు చేస్తున్న కోర్సులపై యాజమాన్యాలు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి సంతృప్తి పర్చారు. ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంజీయూ ఓఎస్డీ డా॥ అల్వాల రవి, డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ సెల్ డా॥ కె.అంజిరెడ్డి, సీఓఈ డా॥ మిర్యాల రమేశ్కుమార్, ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమేశ్, మాజీ అధ్యక్షుడు గింజల రమణారెడ్డి, వివిధ కళాశాలల యజమానులు పాల్గొన్నారు.