యాదగిరిగుట్ట, మార్చి8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని బర్కత్పుర యాదగిరిభవన్ నుంచి గురువారం ఉదయం 30వ అఖండ జ్యోతి యాత్రను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు ప్రారంభించారు. యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అఖండ జ్యోతి యాత్ర బర్కత్పుర యాదగిరిభవన్ నుంచి ప్రారంభమై ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిరి మీదుగా ఈ నెల 11న సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకోనున్నది.
10వ తేదీ ఉదయం 9 గంటలకు మహంకాళి గుడి నుంచి బైపాస్ ద్వారా కొండమడుగు చౌరస్తా చేరుకోనున్నది. మధ్యాహ్నం బీబీనగర్ బాంబినో వద్ద భోజన విరామం. అక్కడి నుంచి గూడూరు, పగిడిపల్లి రామాలయం నుంచి భువనగిరి డాల్ఫిన్ హోటల్ వద్దకు చేరుకోనున్నది. సాయంత్రం 6.30 గంటలకు భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద స్వాగత కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం. అనంతరం పురవీధులు తిరుగుతూ బ్రహ్మంగారి దేవస్థానం, భువనగిరి కోట వద్దకు వస్తుంది. అక్కడి నుంచి వినాయక చౌరస్తా, పాత బస్టాండ్, సాయిబాబా దేవస్థానం నుంచి రాత్రి 9.30 గంటలకు పాత వివేరా హోటల్ వద్దకు చేరుకొని బస చేస్తుంది.
11న ఉదయం 9.30 గంటలకు పూజ అనంతరం అక్కడి నుంచి బయల్దేరి ఉదయం 11.30 గంటలకు రాయగిరి యాదగిరిగుట్ట దేవస్థాన కమాన్ వద్దకు చేరుకుంటుంది. అక్కడి భక్తుల ఘన స్వాగతం స్వీకరించి వడాయిగూడెం, గుండ్లపల్లి, యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి పట్టణంలోని వైష్ణవ సమాఖ్య కార్యాలయం వద్ద ఆలయ అర్చకులు స్వాగతం పలికి వేదఘోషను పఠిస్తారు. రాత్రి 8.30 గంటలకు అఖండ జ్యోతి యాత్ర యాదగిరికొండపైకి చేరుకుంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ రఘు, 30వ అఖండ జ్యోతి ఆహ్వాన సంఘం చైర్మన్ సద్ది వెంకట్రెడ్డి, అధ్యక్షుడు ఎంపల్ల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.