నల్లగొండ/రామగిరి, మే 10 : పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. సర్కారు పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించారు. రెసిడెన్షియల్, మోడల్, కేజీబీవీ స్కూళ్ల విద్యార్థులు మంచి మార్కులతో ఔరా అనిపించారు. నల్లగొండ జిల్లాలో 89.59శాతం మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 17వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 39 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు వచ్చాయి.
నల్లగొండ, మే 10 : రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థికి ఏటా రూ.1.25 లక్షలు వెచ్చించి ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించి విద్యా బోధన చేస్తున్న గురుకులాలు ఈసారి సైతం ఫలితాల్లో తమ హవా కొనసాగించాయి. ఇంటర్తోపాటు పదో తరగతిలోనూ సత్తా చాటి విజయదుందుభి మోగించాయి. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ గురుకులాలు మొత్తం 73 విద్యా సంస్థలు ఉండగా ఆయా విద్యా సంస్థల్లో పదో తరగతి చదివే విద్యార్థుల్లో 96.40 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 73 గురుకులాల్లోని విద్యార్థులు 5,347 మంది పరీక్షలు రాయగా, అందులో 5,155 మంది ఉత్తీర్ణులయ్యారు. బీసీ గురుకులాల్లో 1,996 మందికి 1,949 మంది(97.65) మంది ఉత్తీర్ణులవగా, ఎస్సీ గురుకులాల్లో 1,996 మందికి 1,889(94.64శాతం) మంది, మైనార్టీల్లో 730 మందికి 711(97.39శాతం)మంది, ట్రైబల్ గురుకులాల్లో 625 మందికి 606(96.96శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఆయా గురుకులాల్లో 29 మంది 10 జీపీఏ సాధించగా అత్యధికంగా బీసీ గురుకులాల్లో 17 మంది, ఎస్సీ గురుకులాల్లో 7 మంది, మైనార్టీలో ముగ్గురు, ట్రైబల్లో నలుగురు పది జీపీఏ సాదించారు. ఇక 23 కళాశాలల్లో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.
నల్లగొండ జిల్లా వెనుకంజ
రామగిరి : రాష్ట్ర విద్యాశాఖ బుధవారం పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. అయితే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 39 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు రావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 19,236 మంది విద్యార్థులు హాజరుకాగా 17,234 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 89.59 శాతం ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో నల్లగొండ జిల్లా 17వ స్థానంలో నిలువగా గత సంవత్సరం 14వ స్థానం దక్కింది. అయినప్పటికీ 10జీపీఏ సాధించిన విద్యార్థులు అధికంగా ఉండడం విశేషనం. ఫలితాల్లో బాలురు ముందు వరుసలో నిలిచారు. గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల్లో మెరుగైన ఫలితాల వచ్చాయి.
134 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు
పదో తరగతి ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా 480 పాఠశాలలుండగా 134 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. అయితే వీటిలో జడ్పీ పాఠశాలలు 39, బీసీ వెల్ఫేర్ 7, ట్రైబల్ వెల్ఫేర్ 4, సోషల్ వెల్ఫేర్ 3, మినీ గురులకులాలు 2, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, ఫ్రభుత్వ పాశాలలు ఒక్కొక్కటి, 75 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
15 రోజుల్లోగా రీకౌంటింగ్కు అవకాశం..
రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజులు అవకాశం కల్పించారు. అయితే ఒక్క సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలని డీఈఓ భిక్షపతి, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ యూసూఫ్ తెలిపారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ అండ్ సప్లిమెంటరీ ఆఫ్ ఫొటో కాపీ(మూల్యాంకనం చేసిన జవాబుపత్రం) తీసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. అయితే ఇందుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ట్రెజరీలో చలానా తీసి హాల్టికెట్ జతచేసి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సంతకం చేయించి డీఈఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
జూన్ 14 నుంచి అడ్వాన్స్ పరీక్షలు..
పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు జూన్లో జరిగే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఈ నెల 26లోగా అపరాధ రుసుము లేకుండా ఫీజులు చెల్లించాలని డీఈఓ భిక్షపతి సూచించారు. రూ.50 అపరాధ రుసుముతో పరీక్షలు జరిగే రెండు రోజుల ముందు వరకు విద్యార్థులు ఫీజు చెల్లించే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 14 నుంచి 22 వరకు జరుగనున్నాయి.
సూర్యాపేట జిల్లాలో 89.93 శాతం ఉత్తీర్ణత
సూర్యాపేట అర్బన్ : పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 89.93 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 12,190 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 10,963 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 5,912 మంది హాజరుకాగా, 5,388 మంది ఉత్తీర్ణతతో 91.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 6,278 మంది హాజరుకాగా 5,575 మంది ఉత్తీర్ణత సాధించగా 88.8 శాతం ఉత్తీర్ణత పొందారు.
32 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం&
జిల్లాలోని 32 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 116 ప్రైవేట్ పాఠశాలలకు 67 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురతో పోల్చితే బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు.